
హైదరాబాద్: పోటీకి దిగితే .. కచ్చితంగా పతకంతో తిరిగొస్తానని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. కుడి మోకాలి గాయం కారణంగా గత అక్టోబర్ నుంచి సానియా ఆటకు దూరంగా ఉంది. ''కొన్ని నెలల్లో మళ్ళీ రాకెట్ పడతానని అనుకుంటున్నా. ఆసియా క్రీడలకు వెళ్ళిన ప్రతిసారి పతకంతో తిరిగొచ్చా. ఈసారి కూడా అలాగే జరగాలని కోరుకుంటున్నా. నేను వెళితే మాత్రం పతకంతో తిరిగొస్తా''నని సానియా తెలిపింది.

మహిళల టెన్నిస్ను సెరెనా సహా ఏ ఒక్కరూ ఎక్కువ కాలం శాసించలేరని చెప్పింది. యువ ప్రతిభావంతులు టాప్ ర్యాంకర్లను కంగుతినిపిస్తున్న సంగతి మరవొద్దని సూచించింది. ఫెడ్ కప్ టీమ్ టోర్నమెంట్లో భారత యువతార అంకిత్ రైనా ప్రదర్శన అద్భుతంగా ఉందని సానియా కితాబిచ్చింది.
'ఫెడ్ కప్లో ఈసారి యువ క్రీడాకారిణుల పోరాటపటిమ ఆకట్టుకుంది. కానీ తదుపరి దశకు చేరకపోవడమే నిరాశను కలిగిస్తోంది. ఆ వెలితి ఇంకా కొనసాగుతోంది' అని హైదరాబాదీ స్టార్ చెప్పింది. ఫెడ్ కప్లో అంకిత అసాధారణమైన ఆటతీరును ప్రదర్శించిందని కొనియాడింది. తనకన్నా ఎంతో మెరుగైనా, టాప్- 100 ర్యాంకర్లను ఆమె కంగుతినిపించిన తీరు గొప్ప పురోగతి అని ప్రశంసించింది.

అంకితను తదుపరి భావి సానియాగా భావించవచ్చా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... చాన్నాళ్లుగా ఎంతో మంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. అయితే వీళ్లందరికీ చెబుతున్నా... ఎందుకు మనం సానియా దగ్గరే ఆగిపోవాలి. నన్ను మించి మేటి క్రీడాకారిణిగా ఎదగాలని ఆశిద్దాం' అని తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో జరిగే ఆసియా క్రీడలకు ఇండోనేషియా ఆతిథ్యమివ్వనుంది.