సెమీస్ చేరిన తొలి ఆటగాడిగా
మరోవైపు ప్రీ క్వార్టర్స్లో ఫెదరర్ను ఓడించి సంచలనం సృష్టించిన గ్రీస్ కుర్రాడు స్టెఫనోస్ సిట్సిపాస్ 7-5, 4-6, 6-4, 7-6 (2)తో రాబర్టో బటిస్టా అగుట్ (స్పెయిన్)ను ఓడించాడు. సిట్సిపాస్ 22 ఏస్లు సంధించడం విశేషం. ఈ క్రమంలో 2003లో ఆండీ రాడిక్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ చేరిన పిన్న వయస్కుడిగా 20 ఏళ్ల సిట్సిపాస్ రికార్డు సృష్టించాడు. దీంతో పాటు గ్రీస్ దేశం నుంచి గ్రాండ్స్లామ్ సెమీస్ చేరిన తొలి ఆటగాడి గానూ నిలిచాడు. గురువారం జరిగే సెమీస్లో రఫెల్ నాదల్తో సిట్సిపాస్ తలపడనున్నాడు.
తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని
మ్యాచ్ అనంతరం ఈ ఏడాది తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకున్నానని సిట్సిపాస్ వ్యాఖ్యానించాడు. ‘ఈ ఏడాది నీ లక్ష్యమేంటి అని అడిగితే గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరడం అని చెప్పాను. అయితే ఇంత త్వరగా జరుగుతుందని ఊహించలేదు' అని 20 ఏళ్ల సిట్సిపాస్ అన్నాడు.
సెమీఫైనల్కు చేరిన క్విటోవా
మహిళల సింగిల్స్లో ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్) సెమీఫైనల్కు చేరింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 6-4తో 15వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై నెగ్గి 2012 తర్వాత తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో క్విటోవా మూడు ఏస్లు సంధించి, మూడుసార్లు బార్టీ సర్వీస్ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్ చేరే క్రమంలో క్విటోవా ఇప్పటివరకు తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం.
తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ కూడా ఇదే
2014లో వింబుల్డన్ టోర్నీ తర్వాత క్విటోవా సెమీఫైనల్ చేరిన తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ కూడా ఇదే కావడం గమనార్హం. 2016లో కత్తి దాడికి గురయ్యాక ఓ గ్రాండ్స్లామ్ టోర్నీ సెమీస్ చేరడం క్విటోవాకు ఇదే తొలిసారి. గురువారం సెమీఫైనల్లో ఆమె అమెరికా అన్సీడెడ్ క్రీడాకారిణి డానియల్ కోలిన్స్తో తలపడుతుంది.
కన్నీళ్లు కావివి ఆనంద బాష్పాలు
"కన్నీళ్లు కావివి ఆనంద బాష్పాలు. నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నా. కత్తి దాడిలో గాయపడ్డాక మళ్లీ ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీస్ దశకు రావడానికి నేను తీవ్రంగా శ్రమించాను. నాకైతే ఇది రెండో కెరీర్లాంటిదే. పునరాగమనం చేశాక గ్రాండ్స్లామ్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని అనుకోలేదు. ఈ క్షణాలను నేనెంతో ఆస్వాదిస్తున్నాను" అని విజయానంతరం సెంటర్కోర్టులో క్విటోవా వ్యాఖ్యానించింది.

పేస్ జోడీ ఔట్:
భారత వెటరన్ లియాండర్ పేస్కు మిక్స్డ్ డబుల్స్లో చుక్కెదురైంది. మిక్స్డ్ డబుల్స్లో ‘వైల్డ్ కార్డు'తో బరిలోకి దిగిన లియాండర్ పేస్ (భారత్)-సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీ రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. పేస్-స్టోసుర్ జోడీ 6-4, 4-6, 8-10తో ఐదో సీడ్ రాబర్ట్ ఫరా (కొలంబియా)-అనా లెనా గ్రోన్ఫెల్డ్ (జర్మనీ) జోడీ ద్వయం చేతిలో పరాజయాన్ని చవిచూసింది.


Click it and Unblock the Notifications












