దోహా: మాజీ టెన్నిస్ నంబర్వన్, స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ పునరాగమనంలో శుభారంభం చేశాడు. ఖతార్ ఓపెన్ 2021లో భాగంగా దోహా వేదికగా బుధవారం జరిగిన రెండో రౌండ్లో 7-6 (10-8), 3-6, 7-5తో డాన్ ఎవాన్స్ (బ్రిటన్)పై ఫెడరర్ విజయం సాధించాడు. ఫెడరర్ మద్యమద్యలో బ్రేక్ తీసుకోవడంతో మ్యాచ్ 2 గంటల 24 నిమిషాల పాటు సాగింది. ఈ మ్యాచుకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. స్విస్ దిగ్గజం చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడడంతో అభిమానులు సంతోషంతో కేకలు వేశారు.
మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న రోజర్ ఫెడరర్కు గత 13 నెలల్లో ఇదే తొలి మ్యాచ్. ఫెడరర్ దాదాపు 405 రోజులు తర్వాత కోర్టులోకి అడుగుపెట్టాడు. స్విస్ దిగ్గజం చివరిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020 సెమీఫైనల్లో ఆడాడు. గాయం కారణంగా గత సంవత్సరం యుఎస్ ఓపెన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్ నుండి వైదొలిగాడు. ఇక 2021 ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో కూడా ఆడలేదు. చివరకు ఖతార్ ఓపెన్ 2021లో బరిలోకి దిగాడు. ఈ టోర్నీ తొలి రౌండ్లో ఫెదరర్కు బై లభించింది.
మేజర్ టోర్నీల నుంచి రోజర్ ఫెడరర్ తప్పుకోవడంతో రిటైర్మెంట్ ఇస్తాడని ఊహాగానాలు వచ్చాయి. అయితే అవన్నీ గాలి వార్తలే అని ఖతార్ ఓపెన్ 2021లో బరిలోకి దిగి నిరూపించాడు. ఇక ఈ సంవత్సరం జరగనున్న వింబుల్డన్ ఓపెన్ మరియు టోక్యో ఒలింపిక్స్పై ఫెడరర్ ఇప్పటికే దృష్టిపెట్టాడు. ఆ దిశగా ప్రణాళికలు వేసుకుని మొదటగా ఖతార్ ఓపెన్లో బరిలోకి దిగాడు.
'తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను గెలిచినా, ఓడినా మ్యాచ్ ఆడాలనుకున్నా. 13 నెలల్లో ఇదే తొలి మ్యాచ్. గెలుపు రుచి ఎప్పటికీ బాగుంటుంది. ఇది మంచి మ్యాచ్. డాన్ ఎవాన్స్ బాగా ఆడాడు. గత 2 వారాలుగా అతనితో కలిసి ఆడుతున్నా. మ్యాచులో నేను అలసిపోయాను. మ్యాచ్ కంటే అలసిపోవటంపైనే ఎక్కువ దృష్టి పెట్టా. నాకు నేను సర్దిచెప్పుకుంటూ మ్యాచ్ ఆడాను. నేను మంచి మ్యాచ్ ఆడానని అనుకుంటున్నా. నా ప్రదర్శనపై సంతోషంగా ఉంది. ముగింపు బాగుంది' అని ఆన్-కోర్ట్ ఇంటర్వ్యూలో ఫెడరర్ చెప్పాడు.
India vs England: భారత్ 7 సార్లు.. ఇంగ్లండ్ 7 సార్లు! ఈసారి గెలుపెవరిది?