
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టైటిల్ను మరోసారి సెర్బియా యోధుడు సొంతం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్లో జకోవిచ్ విజేతగా నిలిచాడు. రెండేళ్లుగా గాయాలు, ఫామ్లేమితో ఇబ్బందిపడుతూ వైఫల్యాలు చవిచూస్తున్న జకోవిచ్.. మళ్లీ గ్రాండ్స్లామ్ టైటిల్తో జోరు అందుకున్నాడు.

లండన్ వేదికగా ఆదివారం రాత్రి ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో ప్రత్యర్థి, దక్షిణాఫ్రికా ఆటగాడు అండర్సన్పై 6-2, 6-2, 7-6తో విజయం సాధించాడు. కెరీర్లో జకోవిచ్కి ఇది నాలుగో వింబుల్డన్ టైటిల్కాగా.. మొత్తంగా ఇది 13వ గ్రాండ్స్లామ్ టైటిల్. ఈ సెర్బియా స్టార్ చాలా రోజుల తర్వాత.. తన మునుపటి ఆటతీరుతో అభిమానుల్ని అలరించాడు.
తొలి రెండు సెట్లలోనూ తడబడిన అండర్సన్ మూడో సెట్లో అనూహ్యంగా పుంజుకున్నాడు. ప్రత్యర్థి జకోవిచ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో మూడో సెట్ 6-6తో సమమైంది. దీంతో మ్యాచ్ టై బ్రేక్ దారితీసింది. అయితే, విపరీతమైన ఒత్తిడికి లోనైన అండర్సన్ చివర్లో పట్టుతప్పాడు. దీంతో 7-3తో జకోవిచ్ ఆధిక్యత ప్రదర్శించి మూడో సెట్లో 7-6తో నిలిచాడు. దీంతో వరుసగా మూడు సెట్లు గెలిచిన జకోవిచ్ విజయకేతనం ఎగురవేశాడు. ఫైనల్లో అతను కొట్టిన కొన్ని ఫోర్హ్యాండ్ షాట్లకి అండర్సన్ వద్ద సమాధానమే లేకపోయింది.
టైటిల్ను తన కొడుకుతో కలిసి అందుకున్న జకోవిచ్ భావోద్వేగానికి గురయ్యాడు. 'గత రెండేళ్లుగా చాలా కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను. ఒక సర్జరీ చేయించుకుని.. దాదాపు ఆరు నెలలు ఆటకి దూరమయ్యా. దీంతో.. నా ఆటపై నాకే సందేహాలొచ్చాయి. అయితే.. మళ్లీ ఈ స్థాయి ప్రదర్శనని చేస్తానని ఊహించలేదు. మూడేళ్ల నా కొడుకు చూస్తుండగా.. ఈ టైటిల్ను గెలవడం చాలా సంతోషంగా ఉంది' అని జకోవిచ్ వెల్లడించాడు.