న్యూయార్క్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి వైదొలుగుతున్న స్టార్ క్రీడాకారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఇప్పటికే ఈ మెగా ఈవెంట్కు దూరం అయ్యారు. తాజాగా ఈ జాబితాలో మరో ఇద్దరు స్టార్ క్రీడాకారిణులు చేరారు.
తాజాగా మహిళల సింగిల్స్ జాబితాలో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్), ఏడో ర్యాంకర్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు ప్రయాణించి ఇతరులను ఇబ్బంది పెట్టదలచుకోలేదని స్వితోలినా అన్నారు.
'సురక్షిత వాతావరణంలో యూఎస్ ఓపెన్ను నిర్వహించేందుకు నిర్వాహకులు తీసుకుంటున్న చర్యలను నేను గౌరవిస్తున్నాను. అయినా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు ప్రయాణించి నాతో పాటు నా సహాయక సిబ్బందిని ప్రమాదంలో నెట్టాలని భావించడంలేదు. అక్కడ వైరస్ విలయతాండవం చేస్తోంది' అని గత ఏడాది యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్కు చేరిన ఎలీనా స్వితోలినా ట్వీట్ చేసారు.
'కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు. పరిస్థితులు ఎక్కడచూసినా ఆందోళనకరంగానే ఉన్నాయి. అమెరికాలో కూడా. ప్రతి ఒక్కరూ ముందుగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాక 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని మా దేశ ప్రధాని కోరారు. దాంతో నాకిష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ క్లే కోర్టు టోర్నీకి సన్నాహాలు దెబ్బతింటాయి' అని 28 ఏళ్ల కికి బెర్టెన్స్ పేర్కొన్నారు.
ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 50 లక్షలు దాటిపోగా.. లక్షా 60 వేల మంది మరణించారు. యూఎస్ ఓపెన్ టోర్నీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు న్యూయార్క్లో జరుగుతుంది. మరోవైపు బ్రిటన్ టెన్నిస్ స్టార్ అండీ ముర్రేకు యూఎస్ ఓపెన్లో వైల్డ్కార్డ్ ఎంట్రీ లభించింది. జనవరి 2019 తర్వాత ముర్రే బరిలోకి దిగబోతున్న తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఇది.
అందరి కోసం ప్రార్థిస్తున్నా.. 2020 దయచేసి కనికరించు: యువరాజ్