హైదరాబాద్: సెప్టెంబరులో ఆసియా/ఓసియానా గ్రూప్లో డేవిస్ కప్ మ్యాచ్ ఆడనున్న భారత్కు బుధవారం తీసిన డ్రాలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు డేవిస్ కప్లో తలపడనున్నాయి. ఇరు దేశాల మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో భారత టెన్నిస్ జట్టు పాక్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతించే అవకాశం లేదు.
టెన్నిసే కాదు.. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం పాక్లో పర్యటించేందుకు ఏ క్రీడా జట్టునూ అనుమతించట్లేదన్న సంగతి తెలిసిందే. దీంతో భారత్-పాక్ డేవిస్ మ్యాచ్ తటస్థ వేదికలో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, వేదికను మార్చాలంటే ఐటీఎఫ్ అంగీకరించాలి. పాక్ గతేడాది ఉజ్బెకిస్థాన్, కొరియాలకు ఇస్లామాబాద్లో ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వేదిక మార్పుకు అంతర్జాతీయ సమాఖ్య ఒప్పుకుంటుందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. పాకిస్థాన్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతించకపోతే, వేదికను మార్చేందుకు ఐటీఎఫ్ నిరాకరిస్తే... భారత టెన్నిస్ జట్టు తప్పకుండా వాకోవర్ ఇవ్వాల్సిందే. వాకోవర్ అంటే ఆడకుండానే పాక్ గెలిచినట్లు ఒప్పుకోవడం.
తాజా 'డ్రా'లో భాగంగా భారత్, పాక్లు ఈ సెప్టెంబర్లో తలపడతాయి. చివరి సారిగా భారత్ 1964లో పాకిస్తాన్లో డేవిస్ కప్ మ్యాచ్లు ఆడింది. 1964 తర్వాత ఒక్క భారత డేవిస్కప్ జట్టు కూడా పాకిస్థాన్కు వెళ్లలేదు. 1971లో భారత జట్టు ఇలాగే వాకోవర్ ఇచ్చింది. ఇందులో గెలిచిన జట్టు వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్కు అర్హత సాధిస్తుంది.