మూడో రౌండ్కు ఫెదరర్
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఫెదరర్ (స్విట్జర్లాండ్) 7-6 (7/5), 7-6 (7/3), 6-3తో బ్రిటన్ క్వాలిఫయర్ డాన్ ఇవాన్స్పై కష్టపడి గెలిచాడు. రెండు గంటలా 35 నిమిషాల పోరులో ఆరుసార్లు టోర్నీ విజేత ఫెడెక్స్కు 180వ ర్యాంకర్ ఇవాన్స్ చెమటలు పట్టించాడు. అయితే 11 ఏస్లు, 56 విన్నర్లతో రోజర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు.
నాదల్ అలవోక విజయం
పురుషుల సింగిల్స్ మ్యాచ్లో రెండో సీడ్ నాదల్ 6-3, 6-2, 6-2తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)పై అలవోక విజయం సాధించాడు. ఆరోసీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 7-5, 6-7 (9/11), 6-4, 6-4తో మెక్డొనాల్డ్ (అమెరికా)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఐదోసీడ్ స్లోనె స్టీఫెన్స్ (అమెరికా) 6-3, 6-1తో టిమియా బబోస్ (హంగేరి)పై, కెర్బర్ (జర్మనీ) 6-2, 6-3తో హదాద్ (బ్రెజిల్)పై గెలిచారు.
అండర్సన్ నిష్క్రమణ
దక్షిణాఫ్రికా యువ సంచలనం కెవిన్ అండర్సన్ ఆస్ట్రేలియిన్ ఓపెన్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. అమెరికా యువ ఆటగాడు తియాఫోయ్ చేతిలో 4-6, 6-4, 6-4, 7-5స్కోరుతో అండర్సన్ పరాజయం పాలయ్యాడు. ఆట ప్రారంభం నుంచి మోచేతిగాయంతో ఇబ్బంది పడిన అండర్సన్.. తియాఫోమ్ జోరును అడ్డుకోలేకపోయాడు. గతేడాది వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిన కెవిన్ అండర్సన్ టోర్నీ నుంచి వైదొలిగిన అతితక్కువ ర్యాంక్ ఆటగాడిగా నిలిచాడు. మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్ తొలి రౌండ్లో ప్రపంచ నెంబర్ వన్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 6-2, 6-2తో క్వాలిఫయర్ మిచెల్ క్రూజెర్ (అమెరికా)పై సులువుగా గెలిచాడు.
మూడోరౌండ్లో షరపోవా, వోజ్నియాకి
మహిళల సింగిల్స్లో మాజీ చాంపియన్ మరియా షరపోవా సోమవారం జరిగిన రెండోరౌండ్ మ్యాచ్లో స్వీడన్ అమ్మాయి రెబెక్కా పీటర్సన్ను 6-2,6-1 స్కోరుతో వరుసగా రెండోగేమ్లోనూ విజయం సాధించింది. మూడోరౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా వోజ్నియాకితో పోటీ పడనుంది. రెండోరౌండ్లో వోజ్నియాకి 6-1,6-3 స్కోరుతో స్వీడన్కు చెందిన జొహన్నా లార్సన్ను ఓడించింది. ఇక, 2017 విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా) 6-0, 6-2తో మారియా (జర్మనీ)ని ఓడించింది. టాప్సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6-7 (2/7), 6-4, 6-2తో కై యా కనేపి (ఎస్తోనియా)పై నెగ్గింది. బౌచర్డ్ (కెనడా) 6-2, 6-1తో షుయ్ పెంగ్ (చైనా) పై, ప్లిస్కోవా (చెక్రిపబ్లిక్) 6-3, 6-2తో ముచోవా (చెక్)పై గెలిచారు. కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మాజీ చాంపియన్ విక్టోరియా అజరెంకో రెండోరౌండ్లోనే నిష్క్రమించి నిరాశ పరిచింది.
పేస్, బోపన్న ఔట్
పురుషుల డబుల్స్లో భారత్ పోరు ముగిసింది. రోహన్ బోపన్న, లియాండర్ పేస్ జోడీలు తొలి రౌండ్ కూడా దాటలేకపోయాయి. మొదటి రౌండ్లో రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ జోడీ 1-6, 6-4, 5-7తో పాబ్లో కారెనో బుస్టా, గిలెర్మో గ్రేసియా లోపెజ్ ద్వయం చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్లో లియాండర్ పేస్, ఏంజెల్ రెయేస్-వరెల జోడీ 5-7, 6-7 (4)తో ఆస్టిన్ కాయిసెక్ (అమెరికా), సితాక్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓడింది.