సిడ్నీ: షెడ్యూల్ ప్రకారమే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ జరుగనుంది. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 2 వరకు మెల్బోర్న్ పార్క్లో ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ జరగనుంది. ఈ మేరకు టోర్నీ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆ్రస్టేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కార్చిచ్చు సెగ టోర్నీకి తగులుతుందనే వార్తల్ని నిర్వాహకులు కొట్టిపారేశారు.
నాలుగు రోజుల టెస్టులకు ఇర్ఫాన్ పఠాన్ మద్దతు!!
ఆస్ట్రేలియాను అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చు మెల్బోర్న్ పార్క్కు ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో రగులుతోంది. కార్చిచ్చు వల్ల టోర్నీ వేదికకు, ఆటగాళ్లకు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగదని టెన్నిస్ ఆ్రస్టేలియా చీఫ్ క్రెయిగ్ టైలీ ఓ ప్రకటనలో తెలిపారు. ఏటీపీ ప్లేయర్స్ కౌన్సిల్ అధ్యక్షుడైన నొవాక్ జొకోవిచ్ మీడియాతో మాట్లాడుతూ... కార్చిచ్చు పొగవల్ల సమస్య ఉంటే మ్యాచ్ల్ని ఆలస్యంగా ప్రారంభించే అవకాశాల్ని పరిశీలించాలని సూచించారు. దీనిపై స్పందించిన క్రెయిగ్ వాతావరణ శాఖ నిపుణులు గాలి నాణ్యతపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తున్నారని, వారితో నిర్వాహక కమిటీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ అర్హత మ్యాచులు జనవరి 14 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రధాన టోర్నీ మాత్రం 20 నుంచి వచ్చే నెల 2 వరకు జరుగుతుంది. ఏటా ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీకి ముందు సన్నాహక టోర్నీగా బ్రిస్బేన్ ఈవెంట్ జరుగుతుంది. ఈ టోర్నీతో అందరూ ఫామ్ అందుకోనున్నారు. మాజీ ప్రపంచ నంబర్వన్ మరియా షరపోవాకు ఈనెల 6 నుంచి బ్రిస్బేన్లో జరిగే ఈ టోర్నీలో వైల్డ్కార్డ్ ఎంట్రీ దక్కింది.
కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని అడవులలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ మంటలు న్యూసౌత్ వేల్స్, విక్టోరియాలోని ఈస్ట్ గిప్స్లాండ్ తదితర ప్రాంతాలకు వ్యాపించడంతో.. ఏంతో మంది మరణించారు. ఇక వందల సంఖ్యలో గాయపడ్డారు. మంటల బారిన పడ్డ బాధితులను ఆదుకునేందుకు ఎంతో మంది ముందుకొచ్చారు. ఇందులో టెన్నిస్ స్టార్లు కూడా ఉన్నారు. ఆ్రస్టేలియన్ ఓపెన్ ద్వారా వచ్చే డబ్బును బాధితులకు డొనేట్ చేస్తున్నారు.