
హైదరాబాద్: సోమవారం ఏటీపీ ప్రకటించిన అధికారిక ర్యాంకుల్లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ మియామి ఓపెన్లో అమెరికా ఆటగాడు జాన్ ఇస్నర్ చేతిలో ఓడిపోవడంతో రెండో ర్యాంకుకు పడిపోయాడు.
దీంతో నాదల్ తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రోటర్డామ్ ఓపెన్ చాంపియన్లో ఫెదరర్ డచ్ ప్లేయర్ రాబిన్ హేస్ను ఓడించడంతో నాధల్ తన తొలి ర్యాంకును కోల్పోయాడు. దీంతో పురుషుల సింగిల్స్లో నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్న పెద్ద వయస్కుడిగా ఫెదరర్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.
తన కెరీర్లో 16 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సొంతం చేసుకున్న రఫెల్ నాదల్ తొలిసారి 2008 ఆగస్టు 18న నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకున్నాడు. 46 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగిన ఫెదరర్ ఆ తర్వాత నెంబర్ వన్ ర్యాంకుని కోల్పోయాడు. మళ్లీ జూన్ 7, 2010లో అగ్రస్థానంలో నిలిచి 56 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకుని నిలబెట్టుకున్నాడు.
ప్రస్తుతం నాదల్ 8770 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఫెడరర్ (8670) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ తన టాప్ ర్యాంకును పదిలంగా ఉంచుకుంది. హలెప్ 8,140 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఆ తర్వాతి స్థానాల్లో డెన్నార్క్కు చెందిన వొజ్నయాకి(6,790 పాయింట్లు), స్పెయిన్కు చెందిన ముగురుజా(5,970 పాయింట్లు), ఉక్రెయిన్కు చెందిన ఇలినా స్విటోలినా(5,630)లు ఉన్నారు. కాగా, యూఎస్ క్రీడాకారిణి స్టీఫెన్స్ తన కెరీర్లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకోవడం విశేషం.