
హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో సంచలం నమోదైంది. టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే రెండో రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. రెండో రౌండ్ మ్యాచ్లో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్) 7-5, 2-6, 6-4, 6-4తో ముర్రేను చిత్తుగా ఓడించాడు.
గాయం నుంచి కోలుకుని చాలా నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన ముర్రే ఇంత త్వరగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. మరో వైపు 2016 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో అతను 7-6 (5), 4-6, 6-3, 7-5తో యుగో హంబర్ట్ (ఫ్రాన్స్)ను ఓడించాడు.
వీరితో పాటు డెల్పొట్రో, వావ్రింకా, ఇస్నర్, అండర్సన్ ముందంజ వేశారు. మహిళల విభాగంలో ఆరు సార్లు చాంపియన్గా నిలిచిన సెరెనా విలియమ్స్ (అమెరికా) అలవోకగా మూడో రౌండ్కు చేరుకుంది. రెండో రౌండ్లో ఆమె 6-2, 6-2తో కరీనా వితాఫ్ట్ (జర్మనీ)పై గెలుపొందింది.
మరో మ్యాచ్లో వీనస్ విలియమ్స్ (అమెరికా) 6-4, 7-5తో కామిలా గియార్గీ (ఇటలీ)ని ఓడించి ముందంజ వేసింది. జ్వొనరెవా 3-6, 6-7 (7-9)తో సబలెంకా చేతిలో ఓడింది. మూడో రౌండ్ మ్యాచ్లో అక్కాచెల్లెళ్లు వీనస్, సెరెనా ప్రత్యర్థులుగా తలపడనుండటం విశేషం.
మరో మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) కూడా తర్వాతి రౌండ్కు చేరుకుంది. రెండో రౌండ్లో స్లోన్ 4-6, 7-5, 6-2తో అన్హెలినా కలీనియా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఇక, పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ (భారత్)-సిటాక్ (అమెరికా) 6-4, 6-4తో రెడికి-జు జోడీపై నెగ్గారు.