31వసారి గ్రాండ్స్లామ్ ఫైనల్లోకి సెరెనా
తాజా విజయంతో 36 ఏళ్ల సెరెనా 31వసారి గ్రాండ్స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించింది. యుఎస్ ఓపెన్ ఫైనల్లో గెలిస్తే అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్( 24 గ్రాండ్స్లామ్లు) నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా-24) పేరిట ఉన్న రికార్డును సెరెనా సమం చేస్తుంది. దీంతో పాటు ఓపెన్ శకంలో (1968 తర్వాత) అత్యధికంగా ఏడుసార్లు యుఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఏకైక క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టిస్తుంది.
తొమ్మిదోసారి తుది పోరుకు అర్హత సాధించిన సెరెనా
2015, 2016లో యుఎస్ ఓపెన్ సెమీఫైనల్లో తిరుగుముఖం పట్టిన సెరెనా విలియమ్స్ తొమ్మిదోసారి తుది పోరుకు అర్హత సాధించింది. ఇందులో ఆరుసార్లు చాంపియన్గా నిలిచి అత్యధికసార్లు విజేతగా క్రిస్ ఎవర్ట్తో రికార్డు సమానంగా ఉంది. ఈసారి గెలిస్తే రికార్డు సెరెనా సొంతమవుతుంది. గతేడాది ఇదే సమయానికి తన కుమార్తె ఒలింపియాకు జన్మనిచ్చిన సెరెనా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది.
|
ఈ ఫైనల్ ఎంతో అద్భుతమైనదిగా అభివర్ణించిన సెరెనా
దీంతో ప్రస్తుత యుఎస్ ఓపెన్ ఫైనల్ తనకెంతో అద్భుతమైనదిగా సెరెనా అభివర్ణించింది. సెమీస్ అనంతరం సెరెనా విలియమ్స్ మాట్లాడుతూ "దంతా అద్భుతంలా అనిపిస్తోంది. సరిగ్గా ఏడాది కిందట ఆసుపత్రిలో బెడ్పై ఉన్నా. ఎటూ కదలలేని దుస్థితి. అలాంటిది సంవత్సరం తిరిగే సరికి ఇక్కడ ఫైనల్ ఆడబోతున్నా" అని విలియమ్స్ తెలిపింది.
చిన్నపిల్లగా ఉన్న సమయంలో కలలు కన్నా
మరో ఫైనలిస్ట్ నవోమి ఒసాకా మాట్లాడుతూ "ఓ గ్రాండ్స్లామ్ తుది పోరులో సెరెనాను ఢీకొనాలని నేను చిన్నపిల్లగా ఉన్న సమయంలో కలలు కనే దానిని. ఇప్పుడు అది నిజమవుతోంది. అయితే ఫైనల్ను ఒక మ్యాచ్గానే చూస్తాను" అని తెలిపింది. ఏడాది మార్చిలో ఒసాకాతో ఆడిన ఏకైక మ్యాచ్లో సెరెనా విలియమ్స్ ఓడిపోయింది. దీంతో ఫైనల్ పోరు ఎలా ఉంటుందోనని టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
|
యుఎస్ ఓపెన్లో వర్షం నుంచి ఊరట
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి యుఎస్ ఓపెన్కు భానుడి సెగలు తగిలాయి. అదిరిపోయే ఎండలకు ఆటగాళ్లు అల్లాడిపోతున్నారు. వేడికి, ఉక్కపోతకు సతమతమవుతున్నారు. మ్యాచ్ల సందర్భంగా టీషర్ట్లపై టీషర్ట్లు మార్చాల్సి వచ్చింది. హీట్ పాలసీని అమలులోకి తెచ్చి మ్యాచ్ల మధ్యలో నిర్వాహకులు 10 నిమిషాల విరామం ఇస్తున్న సంగతి తెలిసిందే. టోర్నీ చివర్లో పడిన వర్షంతో నిర్వాహకులు, ఆటగాళ్లు ఊరట చెందారు. సెరెనా-అనస్తాసియాల సెమీస్ సందర్భంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఆర్ధర్ ఆషే స్టేడియం రూఫ్ను మూసివేసి మ్యాచ్ను నిర్వహించాల్సి వచ్చింది.