జపాన్, తర్వాత నుంచి చైనాలదే అగ్రస్థానం
ఆసియాడ్ పతకాల పట్టికలో 1978 నుంచి ఇప్పటి వరకు జపాన్, తర్వాత నుంచి చైనాలదే అగ్రస్థానం. వీటిని దాటి ఏ దేశమూ నిలవలేకపోయింది. ఇప్పటివరకు చైనా ఏకంగా 1,342 స్వర్ణాలు గెల్చుకుని తన ఆధిపత్యం చాటింది. 957 స్వర్ణాలతో జపాన్ దాని వెనుక ఉంది. ఈ జాబితాలో భారత్ (139)... దక్షిణ కొరియా (696), ఇరాన్ (159), కజకిస్తాన్ (140) తర్వాత ఉంది.
భారత్ అప్పట్లో ఎలా ఉందో 2014లోనూ అదే స్థాయిలో
1982 నుంచి 2014 వరకూ ఆసియా క్రీడల్లో పాల్గొన్న దేశాలను పోల్చి చూస్తే.. భారత్ అప్పట్లో ఎలా ఉందో 2014లోనూ అదే స్థాయిలో పతకాలను సాధించింది. ఇక సహచర దేశాలైన చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కజక్స్తాన్, తైవాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, మలేసియా, హాంగ్కాంగ్, థాయ్లాండ్, సింగపూర్, వియత్నాంలు భారీగా పతకాల వేటలో ముందున్నాయి.
1978లో పాకిస్తాన్ తప్పుకోవడంతో
చర్రితలో ఏ మెగా టోర్నీని ఒకే దేశం వరుసగా రెండుసార్లు నిర్వహించలేదు. థాయ్లాండ్ మాత్రం ఆసియాడ్తో ఆ ఘనత సాధించింది. అంతేకాదు, 1966-78 మధ్య ఏకంగా మూడుసార్లు ఆతిథ్యం ఇచ్చి రికార్డుల్లోకి ఎక్కింది. ఇతర దేశాలు తమవల్ల కాదని చేతులెత్తేసిన సందర్భాల్లో థాయ్లాండ్ ముందుకు రావడమే ఇందుకు కారణం. 1966లో తొలిసారిగా, 1970లో దక్షిణ కొరియా నిస్సహాయతతో, 1978లో పాకిస్తాన్ తప్పుకోవడంతో థాయ్లాండ్ వేదికగా మారింది. 1998లో సొంత బిడ్తో పోటీలు నిర్వహించింది.
ఆసియా క్రీడలంటే థాయ్లాండ్కు ఓ ప్రత్యేకత
ఆసియా క్రీడలంటే థాయ్లాండ్కు ఓ ప్రత్యేకత ఉంది. ఆసియా దేశాల్లో మరేదేశం చేయలేని రికార్డును థాయ్లాండ్ మాత్రమే చేయగలిగింది. విస్తీర్ణంలో, జనాభాలో పెద్దవైన చైనా, భారత్, ఇండోనేషియా కంటే, ఆర్థిక ప్రగతిలో ముందున్న జపాన్, దక్షిణ కొరియా సైతం ఇన్నిసార్లు నిర్వహించ లేకపోవడం గమనార్హం. భారత్లోనే (1951) ప్రారంభమైన ఈ క్రీడలకు మనం ఆతిథ్యం ఇచ్చింది మాత్రం రెండుసార్లే. చివరిగా 1982లో రెండోసారీ ఢిల్లీలోనే జరిగాయి.
థాయ్లాండ్ తర్వాత ఎక్కువ సార్లు వేదికగా
1970లో భద్రతా కారణాలతో వీలుకాదన్న దక్షిణ కొరియా 1986, 2002, 2014లో టోర్నీని నిర్వహించింది. థాయ్లాండ్ తర్వాత ఎక్కువ సార్లు వేదికగా నిలిచింది. అయితే, చాలా ఆలస్యంగా 1974లో ఆసియాడ్లో అడుగిడిన చైనా తర్వాత పదహారేళ్లకే ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత 2010లో మరోసారి పోటీలు ఇక్కడే నిర్వహించింది. జపాన్ 1958లోనే తమ దగ్గర టోర్నీని నిర్వహించింది. మళ్లీ 1994లో... అణుబాంబు బాధిత హిరోషిమాలో ఆడించి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. దేశ రాజధానిలో కాకుండా వేరే నగరంలో ఆసియాడ్ జరగడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం.