ఢిల్లీ: భారత ప్రముఖ బాస్కెట్బాల్ ప్లేయర్ సత్నామ్ సింగ్ భమారా డోపింగ్లో పట్టుబడ్డాడు. దీంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సత్నామ్పై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. భారత్ నుంచి నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)కు ఎంపికైన తొలి బాస్కెట్బాల్ ప్లేయర్గా సత్నామ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్లో పీవీ సింధుకి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
దక్షిణాసియా క్రీడలకు సన్నాహక శిబిరం సందర్భంగా బెంగళూరులో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) 23 ఏళ్ల పంజాబ్ ప్లేయర్ సత్నామ్ శాంపిల్స్ను సేకరించింది. వీటిలో 'ఎ' శాంపిల్ను పరీక్షించగా.. సత్నామ్ నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లుగా పరీక్షలో వెల్లడైంది. దీంతో నవంబర్ 19 నుంచి భమారాపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు 'నాడా' ప్రకటించింది.
అయితే సత్నామ్ నుంచి సేకరించిన శాంపిల్ 'ఏ'లో నిషిద్ధ ఉత్ప్రేకరాలు ఉన్నట్టు నిర్ధారించినా.. ఏ రకమైనవో గుర్తించలేదు. మరోవైపు తానెలాంటి తప్పు చేయలేదని సత్నామ్ చెప్పాడు. తాను ఎప్పుడూ నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకోలేదని, తీసుకోబోనని వ్యాఖ్యానించాడు. 'నాడా'కు చెందిన 'డోపింగ్ నిరోధక క్రమశిక్షణా ప్యానల్ (ఏడీడీపీ)' తన వాదనను వినాలంటూ సత్నామ్ అభ్యర్థన చేశాడు.
ఒకవేళ ఏడీడీపీ సత్నామ్ను డోపీగా నిర్ధారిస్తే.. అతనిపై ఏకంగా 4 సంవత్సరాల సస్పెన్షన్ విధిస్తారు. సత్నామ్ 7 అడుగుల 2 అంగుళాల ఎత్తున్న విషయం తెలిసిందే. 2015లో ఎన్బీఏ ప్లేయర్ల డ్రాఫ్ట్లో చోటు దక్కించుకున్న సత్నామ్ను 'డాలస్ మావెరిక్స్' సొంతం చేసుకుంది.