హైదరాబాద్: అన్ని అవయవాలు సక్రమంగా ఉండి, ప్రతిఒక్క వనరు అందుబాటులో ఉన్నప్పటికీ.. తామేమీ సాధించాలేమనే నిరాశలో ఉంటారు కొంతమంది ప్లేయర్స్. అలాంటివాళ్లు ఒక్కసారి ఈ వీరుల గురించి తెలుసుకుంటే.. జీవితంపై కొత్త ఆశ చిగురించడం ఖాయం. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలుంటాయి. వాటిని దాటితేనే విజేతలుగా నిలుస్తారు. కానీ వీళ్ల జీవితమే కష్టతరమై.. జీవన ప్రయాణంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా.. వెన్నుచూపలేదు. అంగ వైకల్యాన్ని అధిగమించి ఆటల్లో సత్తాచాటి వెలుగులోకి వచ్చారు. ఇప్పుడదే ఆటల్లో దేశం తరపున పారాలింపిక్స్ 2020లో పతకాలు సాధించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి టోక్యో వేదికగానే పారాలింపిక్స్ విశ్వక్రీడలు మొదలుకానున్నాయి.
IND vs ENG: త్వరలోనే విరాట్ కోహ్లీ భారీ సెంచరీ చేస్తాడు: రాజ్కుమార్
పుట్టుకతోనే పలక్ కోహ్లీకి అంగ వైకల్యం. తన వైకల్యాన్ని చూసి పాఠశాల మిత్రులు దూరం పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఆటలు అవసరమా.. బుద్ధిగా చదువుకో అని ఉపాధ్యాయులూ చెప్పారు. ఇప్పటికే ఓ చేయి సరిగ్గా లేదు.. ఉన్న ఇంకో చేతిని పాడు చేసుకుంటావా? అని మందలించారు. దీంతో తానెంటో నిరూపించాలని ఆ అమ్మాయి నిర్ణయించుకుంది.. ఆ సమయంలో పారా బ్యాడ్మింటన్ కోచ్ గౌరవ్ ఖన్నా ఆమెకు అండగా నిలిచాడు. పలక్కు ఉత్తమ శిక్షణ అందించాడు. క్రమంగా ఆటపై పట్టు సాధించిన ఆమె అతి తక్కువ సమయంలోనే టోర్నీల్లో పతకాలు సాధించడం మొదలెట్టింది. అంతర్జాతీయ టోర్నీల్లోనూ సింగిల్స్, డబుల్స్లో సత్తాచాటింది. తన ర్యాంకింగ్స్తో టోక్యో పారాలింపిక్స్కు అర్హత సాధించి.. ఆ ఘనత అందుకున్న అతి పిన్న వయస్సు షట్లర్గా చరిత్ర సృష్టించింది. పూర్తిగా ఎదగని ఎడమచేతితో పుట్టిన 19 ఏళ్ల ఈ పంజాబ్ అమ్మాయి.. ఇప్పుడు టోక్యోలో ఎస్యూ5 సింగిల్స్ విభాగంతో పాటు మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్లోనూ పోటీపడే అవకాశం కొట్టేసింది.
ప్రమోద్ భగత్.. ఇప్పటికే రెండు సార్లు పారా ప్రపంచ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఛాంపియన్గా నిలిచాడు. డబుల్స్లోనూ పతకాల మోత మోగించాడు. కానీ ఇప్పటివరకూ పారాలింపిక్స్లో ఆడే అవకాశం రాలేదు. గత పారాలింపిక్స్ల్లో బ్యాడ్మింటన్ లేకపోవడమే అందుకు కారణం. కానీ ఇప్పుడు టోక్యో పారాలింపిక్స్లో తొలిసారి పారా బ్యాడ్మింటన్ ప్రవేశపెట్టడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 విభాగంలో ప్రపంచ నంబర్వన్గా కొనసాగుతోన్న భగత్.. టోక్యోలో పసిడి పట్టేయాలనే ఆత్రుతతో ఉన్నాడు. ఒడిషాకు చెందిన ఈ 33 ఏళ్ల పారా షట్లర్ ఫామ్ ప్రకారం చూస్తే స్వర్ణం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. చిన్నతనంలోనే అతని ఎడమ కాలికి పోలియో సోకింది.
పుట్టుకతోనే అతని ఓ కాలు సరిగ్గా లేదు. అయినా ఆ లోపం అతనికి ఏ దశలోనూ అడ్డంకి కాలేదు. దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి కలెక్టర్గా ఉద్యోగం సంపాదించినా.. పారా బ్యాడ్మింటన్ ఆటగాడిగా విజయాలు సాదించాడు. అతడు మరెవరో కాదు.. కర్ణాటకకు చెందిన 38 ఏళ్ల సుహాస్. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధా నగర్ జిల్లా మెజిస్ట్రేట్గా పాలన బాధ్యతలు కొనసాగిస్తున్న అతను.. టోక్యో పారాలింపిక్స్లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఆ ఘనత సాధించిన భారత తొలి ఐఏఎస్ అధికారిగానూ చరిత్ర సృష్టించాడు. అటు చదువుతో పాటు ఇటు బ్యాడ్మింటన్పైనా ప్రేమ పెంచుకున్న అతను రాకెట్తో అద్భుతాలు చేయడం మొదలెట్టాడు.
పసిడి గెలిచిన నీరజ్ చోప్రా కంటే ముందే జావెలిన్ త్రోలో పారాలింపిక్స్ల్లో రెండు స్వర్ణాలు గెలిచిన అథ్లెట్ ఒకరున్నారు. అతనే.. భారత పారా అథ్లెట్ దేవేంద్ర జజారియా. జావెలిన్ త్రో ఎఫ్46 విభాగంలో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలిచిన ఈ రాజస్థాన్ అథ్లెట్.. గత 2016 రియో క్రీడల్లో మరోసారి పసిడి అందుకున్నాడు. మధ్యలో 12 ఏళ్ల పాటు పారాలింపిక్స్ జావెలిన్ త్రోలో ఎఫ్46 విభాగంలో పోటీలు నిర్వహించలేదు. 2004లో స్వర్ణం సాధించినపుడు ప్రపంచ రికార్డు సృష్టించిన అతను.. రియోలోనూ ఆ రికార్డును మెరుగుపర్చాడు. ఈ ఏడాది జులైలో 65.71 మీటర్ల దూరం ఈటెను విసిరి మళ్లీ తన రికార్డును మెరుగుపర్చుకున్న ఈ 40 ఏళ్ల అథ్లెట్పై టోక్యోలో కచ్చితంగా పోడియంపై నిలబడతాడనే అంచనాలున్నాయి.