షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్:
పారాలింపిక్స్ సమీక్ష సమావేశం తర్వాత టొషిరో ముటో మీడియాతో మాట్లాడుతూ... 'కరోనా వైరస్ వ్యాప్తి సాధారణ స్థితిలోనే ఉంది. షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ నిర్వహిస్తాం. వైరస్ కంటే భయం త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఆ భయాన్ని పూర్తిగా అణిచివేయాలనుకుంటున్నాం. నియంత్రణకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ వైరస్తో ఒలింపిక్స్కు వచ్చిన ముప్పేమీ లేదు' అని అన్నారు.
జికా వైరస్తో పోరాడిన అనుభవం ఉంది:
'ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కరోనా వైరస్ను మహమ్మారిగా ప్రకటించలేదు. రియో ఒలింపిక్స్ సమయంలో జికా వైరస్తో పోరాడిన అనుభవం మాకుంది. నిపుణుల సలహాల మేరకు ముందుకు సాగుతాం. డబ్ల్యూహెచ్వో సలహాలను కచ్చితంగా పాటిస్తాం' అని ముటో చెప్పారు. 'పర్యాటక రంగంపై కరోనా ప్రభావం చూపడం ప్రారంభించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) సహకారంతో ప్రభుత్వం క్రీడలకు సన్నద్ధమవుతుంది' అని జపాన్ ప్రధాని షింజో అబే తెలిపారు.
జపాన్లో ఒక్కరు కూడా మరణించలేదు:
ఒలింపిక్స్ జరుగనున్న జపాన్లో ఇప్పటివరకు కరోనాతో ఒక్కరు కూడా మృతి చెందలేదు. అయితే సుమారు 45 మందికి ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 28 వేల మందికి ఈ వైరస్ సోకగా.. ఇప్పటివరకు 560 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఇందులో 90 శాతం మరణాలు, వైరస్ బారిన పడినవారంతా చైనాలోనే ఉన్నారు. ఇతర దేశాల్లో కేవలం 191 కేసులే నమోదయ్యాయి.
భారీ ఏర్పాట్లు:
జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జపాన్ రాజధాని టోక్యోలోని షింజుకు నేషనల్ స్టేడియంలో ఒలింపిక్స్ జరగనున్నాయి. శతాబ్ధకాలం తర్వాత మెగా గేమ్స్ నిర్వహణ అవకాశం దక్కించుకున్న జపాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. టెక్నాలజీకి మారుపేరైన జపాన్.. మెగా ఈవెంట్కు హాజరయ్యే అతిథులు, అథ్లెట్లకు రోబోలతో ఆహ్వానం పలకనుంది. సముద్ర తీరప్రాంతంలో క్రూయిజ్ లైనర్లను హోటళ్లుగా ఉపయోగిస్తూ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే రూ.8900 కోట్లతో కొత్త స్టేడియాన్ని సిద్ధం చేసింది.