కరోనా అంతం కాకుంటే ఒలింపిక్స్ రద్దే:
మహమ్మారి ముప్పు తొలగకపోతే.. ఒలింపిక్స్ను 2022కి వాయిదా పడే అవకాశాలేమైనా ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు యొషిరో మోరి సూటిగా సమాధానమిచ్చారు. 'లేదు. అది సాధ్యం కాదు. కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోతే ఒలింపిక్స్ రద్దవుతాయి. అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నా. ఇప్పటికైతే వచ్చే వేసవికి వాయిదా పడ్డాయి. అప్పటికల్లా కరోనాపై విజయం సాధిస్తామనే ఆశ ఉంది. లేకపోతే మా కష్టమంతా వృథా అయినట్టే' అని జపాన్కు చెందిన క్రీడాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యొషిరో మోరి తెలిపారు.
'రద్దయ్యే అవకాశాల్ని కొట్టిపారేసిన టకయా:
ఖర్చును తగ్గించుకునేందుకు ఒలింపిక్స్, పారాలింపిక్స్ ప్రారంభ-ముగింపు ఉత్సవాలను కలిపే నిర్వహించాలని మోరి సూచించారు. అయితే ఇప్పటికే ఈ నాలుగు ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా టిక్కెట్లు అమ్ముడుపోయిన దృష్ట్యా ఇలా చేయడం కూడా అంత సులువు కాదని అంగీకరించారు. గేమ్స్ అధికార ప్రతినిధి మసా టకయా మాట్లాడుతూ... 'రద్దయ్యే అవకాశాల్ని కొట్టిపారేశారు. చైర్మన్ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవని' అని చెప్పారు.
గేమ్స్ నిర్వహణ కష్టమే:
అయితే వైద్య వర్గాల హెచ్చరికలు మాత్రం ఆర్గనైజింగ్ కమిటీ వర్గాల్ని కలవరపెడుతున్నాయి. జపాన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు యొషితకె యొకొకుర మాట్లాడుతూ ... 'వీలైనంత త్వరగా ఔషధంతో పాటు వ్యాక్సిన్ను కనుగొంటారని ఆశిస్తున్నా. గేమ్స్ జరగకూడదని కోరుకోవడం లేదు కానీ ఆ సమయంలో ఇన్ఫెక్షన్ పరిస్థితి ఎలా ఉంటుందనేది కీలకం. ఒకవేళ జపాన్లో నియంత్రణలోకి వచ్చినా ఇతర దేశాల్లో ఉంటే మాత్రం గేమ్స్ నిర్వహణ కష్టమే' అని అన్నారు. జపాన్లో ఇప్పటికి 13,576 పాజిటివ్ కేసులు నమోదు కాగా 389 మంది మృతి చెందారు.
వచ్చే ఏడాది అనుమానమే:
కరోనా భయంతో ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడినా కూడా నిర్వాహకుల్లో ఆందోళన మాత్రం తొలగడం లేదు. వేల కోట్లు కుమ్మరించి, అంతకుమించి ఆదాయాన్ని ఆశిస్తున్న జపాన్కు ఈ విశ్వ క్రీడలు జరగడం అత్యంత అవసరం. కానీ కరోనా మాత్రం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), జపాన్ కలిసి ఈ క్రీడలను 2021 జూలైకి వాయిదా వేశారు. అయితే పరిస్థితులు చూస్తే వచ్చే ఏడాది నిర్వహణపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.