వరుసగా మూడోసారి:
ఎప్పటిలాగే ఈసారి కూడా మెడల్స్ జాబితాలో టాప్లో ఉండటానికి అమెరికా, చైనా పోటీపడ్డాయి. ఒలింపిక్స్ 2020లో చాలా రోజుల వరకూ టాప్లో ఉన్న చైనాను చివరి రోజు అమెరికా వెనక్కి నెట్టింది. శనివారం వరకూ చూస్తే చైనా 38 గోల్డ్ మెడల్స్తో టాప్లో ఉండగా.. అమెరికా ఖాతాలో 36 మాత్రమే ఉన్నాయి. అయితే ఆదివారం బాస్కెట్బాల్, వాలీబాల్లతో పాటు సైక్లిస్ట్ జెన్నిఫర్ వాలెంటీ కూడా గోల్డ్ గెలవడంతో అగ్రరాజ్యం అమెరికా మళ్లీ టాప్లోకి వెళ్లింది. ఒలింపిక్స్లో అత్యధిక మెడల్స్తో అమెరికా ముగించడం ఇది వరుసగా మూడోసారి. రికార్డు స్థాయిలో 600కుపైగా అథ్లెట్లతో బరిలోకి దిగిన అమెరికా.. మొత్తానికి తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. దీంతో చైనాకు మళ్లీ నిరాశే ఎదురైంది.
అగ్రస్థానంలో అమెరికా:
అమెరికా ఖాతాలో మొత్తం 113 మెడల్స్ ఉన్నాయి. ఇందులో 39 గోల్డ్ మెడల్స్. గోల్డ్మెడల్ పరంగా చూసినా.. మొత్తంగా చూసినా అమెరికానే అగ్రస్థానంలోనే ఉంది. అయితే రియో గేమ్స్లో అమెరికాకు 121 మెడల్స్ వచ్చాయి. అందులో 46 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. అప్పటితో పోలిస్తే ఈసారి అగ్రరాజ్యం ప్రదర్శన అంత బాగాలేదు. అంతేకాదు ఆధునిక గేమ్స్ చరిత్రలో తొలిసారి అమెరికాకు ట్రాక్ ఈవెంట్లలో ఒక్క వ్యక్తిగత గోల్డ్ మెడల్ కూడా రాలేదు. చైనా 38 స్వర్ణాలతో పాటు మొత్తం 88 మెడల్స్తో రెండో స్థానంలో నిలిచింది. గోల్డ్ మెడల్స్ పరంగా జపాన్ (27), బ్రిటన్ (22), రష్యన్ ఒలింపిక్ కమిటీ (20) టాప్-5లో ఉన్నాయి.
47వ స్థానంలో భారత్:
టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ పరిస్థితి చాలా మెరుగైందనే చెప్పాలి. రియో గేమ్స్లో 67వ స్థానంతో సరిపెట్టుకున్న భారత్.. ఈసారి ఏకంగా 19 స్థానాలు ఎగబాకింది. శనివారం ఉదయం వరకూ భారత్ 66వ స్థానంలో కొనసాగుతూ వచ్చింది. అయితే జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాదించడంతో ఒక్కసారిగా 47వ స్థానానికి దూసుకొచ్చింది. భారత్ ఆటలు శనివారమే ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఆదివారం ఆటలు ముగిసే సమయానికి ఒక స్థానం దిగజారి 48తో సరిపెట్టుకుంది. భారత్ ఖాతాలో 1 గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ సహా మొత్తం 7 మెడల్స్ ఉన్నాయి. ఒలింపిక్స్లో భారత్ సాధించిన అత్యధిక మెడల్స్ ఇవే కావడం విశేషం.
క్లోజింగ్ సెర్మనీతో గుడ్బై:
19 రోజుల పాటు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఒలింపిక్స్.. ఆదివారం క్లోజింగ్ సెర్మనీతో గుడ్బై చెప్పింది. ముగింపు సందర్భంగా మరోసారి అన్ని దేశాలకు చెందిన అథ్లెట్లు తమ జాతీయ పతాకాలతో స్టేడియంలోకి వచ్చారు. భారత్ తరఫున బ్రాంజ్ మెడల్ విన్నర్, రెజ్లర్ భజరంగ్ పూనియా త్రివర్ణ పతాకంతో సందడి చేశాడు. కరోనా మహమ్మారి వణికస్తున్న సమయంలో విజయవంతంగా ఈ విశ్వక్రీడా సంబరాన్ని నిర్వహించిన టోక్యోకు అథ్లెట్లు కృతజ్ఞతలు తెలిపారు. క్లోజింగ్ సెర్మనీ ప్రారంభంలో జపాన్ క్రౌన్ ప్రిన్స్ అకిషినో, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్తో కలిసి స్టేడియంలోకి వచ్చారు. ఇక టోక్యో ఒలింపిక్స్ 2020లో స్వర్ణాల బోణీని చైనా చేయగా.. చివరి గోల్డ్ మెడల్ను సెర్బియా అందుకుంది. ఆదివారం జరిగిన మెన్స్ వాటర్పోలో ఫైనల్లో గ్రీస్పై గెలిచి సెర్బియా చివరి గోల్డ్ మెడల్ను సొంతం చేసుకుంది.