ప్రముఖుల సంతాపం..
మిల్ఖాసింగ్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, పంజాబ్ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్, పలువురు క్రీడాకారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన లేని లోటును పూడ్చలేనిదంటూ సంతాపం తెలిపారు. 50వ దశకంలోనే ప్రపంచ అథ్లెటిక్లో భారత్కు స్వర్ణ పతకాలను అందించిన ధీరుడిగా కీర్తించారు. కొన్ని తరాలకు ఆయన స్ఫూర్తి ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఎదగాల్సిన అవసరం ఉందని సూచించారు.
అన్నీ స్వర్ణాలే..
1958లో నిర్వహించిన ఆసియా గేమ్స్లల్లో భారత్కు స్వర్ణ పతకాలను సాధించి పెట్టిన ఘనత ఫ్లయింగ్ సిఖ్కు ఉంది. 1958లో 200, 400 మీటర్ల పరుగుపందెంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారాయన. అదే ఏడాది నిర్వహించిన కామన్వెల్త్ క్రీడల్లో అగ్రస్థానంలో నిలిచారు. 1962లో ఏర్పాటైన ఆసియా గేమ్స్ల్లో 400 మీటర్లు, రిలేలో ఆయన వేగాన్ని అందుకునే క్రీడాకారుడే లేడు. ఈ రెండు విభాగాల్లోనూ స్వర్ణ పతక విజేతగా నిలిచారు.
సికింద్రాబాద్తో అనుబంధం..
మిల్ఖాసింగ్కు మన సికింద్రాబాద్తో విడదీయరాని అనుబంధం ఉంది. ఒకరకంగా ఆయన జీవితాన్ని మలుపు తిప్పిందే ఈ సిటీ. మిల్ఖాసింగ్ పేరు మీద సికింద్రాబాద్లో ఓ కాలనీ కూడా వెలిసింది. మిల్ఖాసింగ్ ప్రారంభంలో ఆర్మీలో చేరారు. ఆ సమయంలో 1951లో మిల్ఖాసింగ్ సికింద్రాబాద్లో ఆర్మీకి చెందిన ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఈఎంఈ) సెంటర్లో కేంద్రంలో అడ్మిషన్ లభించింది. 1960 వరకు ఆయన సికింద్రాబాద్లో నివసించారు. ఆ సమయంలో బొల్లారం అమ్ముగూడ పహాడ్ చుట్టూ రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారు.
అమ్ముగూడతో
రాళ్లు నింపిన బ్యాగును మోసుకుంటూ ఈ పహాడ్ చుట్టూ మిల్ఖాసింగ్ పరుగులు తీసేవారు. బొల్లారం రైల్వేస్టేషన్లో పట్టాల మీద కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే రైలుతో సమానంగా రన్నింగ్ చేశానని కొన్ని సందర్భాల్లో మిల్ఖాసింగ్ స్వయంగా చెప్పుకొన్నారు కూడా. ఈఎంఈ సెంటర్లో ఓ కాలనీకి మిల్ఖాసింగ్ పేరు పెట్టారు. అందులోని స్టేడియానికీ ఆయన పేరే ఉంది. మిల్ఖాసింగ్ కన్నుమూతతో అక్కడి ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారు.