
హైదరాబాద్: భారత్కు చెందిన సీమా పునియాకు బరిలోకి దిగకముందే పతకం ఖాయమైంది. 81కేజీల విభాగంలో స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో ఆమె ఆడుతోంది. ఇప్పటికే ఈ విభాగంలో డ్రా ప్రకారం ముగ్గురు బాక్సర్లే మిగిలారు. వారిలో ఎవరు గెలిచి ఎవరు ఓడినా ముగ్గురికి పతకం రావడం మాత్రం ఖచ్చితం.
సెమీస్లో సీమా పునియా స్థానిక ఫేవరెట్ మిహెలా నికోలొవాతో తలపడనుంది. కానీ, మరో క్రీడాకారిణి అనా ఇవనోవా మాత్రం (రష్యా) నేరుగా ఫైనల్ చేరింది. మరోవైపు 60 కేజీల విభాగంలో సరితాదేవి క్వార్టర్ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్స్లో ఆమె 3-2తో మాంచెజ్ (ఇటలీ)పై నెగ్గింది. స్టార్ బాక్సర్లు మేరీకోమ్, శివ థాపలకు క్లిష్టమైన డ్రా పడింది.
మహిళల 48 కేజీల విభాగం తొలి రౌండ్లో మేరీ.. రుమేనియా స్టార్ సెల్టా డుటాతో తలపడనుంది. తానాడిన గత రెండు టోర్నీల్లో (ఆసియా ఛాంపియన్షిప్, ఇండియా ఓపెన్) మేరీ పసిడి పతకాలు సాధించింది. విశేషం ఏమిటంటే 2006, 08, 10 ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో సెల్టా మీద గెలిచే మేరీ స్వర్ణాలు కైవసం చేసుకుంది.
పురుషుల్లో తొలి రౌండ్లో బై దక్కించుకున్న శివ థాప (60 కేజీలు)కు ప్రిక్వార్టర్స్లో కుర్మెట్సోత్ (కజఖ్స్థాన్) రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురుకానున్నాడు. సతీష్కుమార్ (91 కేజీల పైన), హుస్సాముద్దీన్ (56 కేజీలు), మనోజ్కుమార్ (69 కేజీలు), వికాస్ క్రిషన్ (75 కేజీలు) తదితరులు ఈ టోర్నీ బరిలో నిలిచారు.