
గౌహతి: స్టార్ స్ప్రింటర్ హిమదాస్ను డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్గా నియమించాలని అసోం ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. సీఎం సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన బుధవారం రాత్రి గౌహతిలోని జనతా భవన్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో హిమదాస్ను డీఎస్పీగా నియమించాలని నిర్ణయించారు. లీస్, ఎక్సైజ్, రవాణా తదితర వివిధ విభాగాల్లోని క్లాస్-1, క్లాస్-2 ఆఫీసర్లుగా క్రీడాకారులను నియమించడం ద్వారా రాష్ట్రంలో సమీకృత క్రీడా విధానాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి చంద్రమోహన్ పటోవరి తెలిపారు.
అసోం పోలీస్ విభాగంలో డీఎస్పీ ర్యాంకు అధికారిగా హిమదాస్ను.. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్ -1 ఆఫీసర్లుగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. 'ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, సీడబ్ల్యుజీ (క్లాస్ 1) మరియు ప్రపంచ ఛాంపియన్షిప్ సీనియర్ (క్లాస్ 2) పతక విజేతల నియామకం కోసం రాష్ట్రం ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ పాలసీకి సవరణను కామ్ ఆమోదించింది. హిమదాస్ను డిప్యూటీ సూపరింటెండెంట్గా నియమిస్తారు' అని సీఎం తన అధికారిక ట్విట్టర్లో పేర్కొన్నారు.
20 ఏళ్ల అస్సాం స్టార్ స్పింటర్ హిమదాస్ 2018లో అద్భుతంగా రాణించింది. ఫిన్లాండ్లో జరిగిన అండర్-20 ప్రపంచ చాంపియన్షిప్ 400 మీటర్ల ఈవెంట్లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్గా నిలిచింది. ఇదే చాంపియన్షిప్లో 4x400 రిలేలో మరో స్వర్ణం, మిక్స్డ్ రిలేలో రజతం గెలుచుకుంది. ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 చాంపియన్ షిప్స్లో గ్లోబల్ ట్రాక్ ఈవెంట్ ఏదైనా ఫార్మాట్లో బంగారు పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్గా హిమదాస్ రికార్డు సాధించింది.
హిమదాస్ను డీఎస్పీగా నియమించాలన్న అస్సాం కేబినెట్ నిర్ణయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రి కిరెన్ రిజిజు ప్రశంసించారు. 'చాలా సంతోషంగా ఉంది. సీఎం సర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని అస్సాం క్యాబినెట్ మంచి నిర్ణయం తీసుకుంది. డీఎస్పీ పదవిని హిమదాస్కు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది' అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.