ధర్మశాల: ట్వంటీ 20లో దక్షిణాఫ్రికా విజయానికి పదహారవ ఓవరే కారణమని జేపీ డుమిని చెప్పాడు. అప్పటి దాకా భారత్ మెరుగైన స్థితిలో ఉందని, 16వ ఓవర్ లో మూడు సిక్స్లు మ్యాచ్ గమనాన్ని మార్చివేశాయన్నాడు.
అక్షర్ పటేల్ వేసిన ఆ ఓవర్లో దక్షిణాఫ్రికా 22 పరుగులు చేసింది. దీంతో ఒక్కసారిగా రెండు జట్ల స్కోరు బోర్డు మధ్య వ్యత్యాసం తగ్గింది. ఆ ఓవర్ స్పూర్తితో తర్వాత నాలుగు ఓవర్లు బాగా ఆడామని, దీంతో విజయం సాధించామన్నాడు.
ఈ విజయం మరింత ఉత్సాహం ఇస్తుందని, ఇలాంటి ప్రారంభమే తమకు కావాల్సిందని డుమిని పేర్కొన్నాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. భారత్లో మంచి ప్రదర్శనకు ఐపీఎల్ చాలా ఉపయోగపడిందన్నాడు.
దెబ్బకు దెబ్బ తీస్తాం: రోహిత్ శర్మ
టీ20 మ్యాచ్లో సెంచరీ సాధించినా జట్టు విజయం సాధించకపోవడం నిరాశ కలిగిస్తోందని, తర్వాత మ్యాచ్లో పుంజుకుని ఆడి దెబ్బకు దెబ్బ తీస్తామని రోహిత్ శర్మ అన్నాడు. దేశం తరఫున ఏ ఫార్మాట్లో సెంచరీ చేసినా ఆనందాన్నిచ్చే విషయమేనని చెప్పాడు.
కానీ శతకం సాధించినా జట్టు గెలవకపోవడం నిరాశ కలిగిస్తోందన్నాడు. జట్టు గెలవనప్పుడు ఎన్ని పరుగులు చేశామన్నది ముఖ్యం కాదని, వ్యక్తిగతంగా ఈ ఇన్నింగ్స్ సంతోషాన్నిచ్చిందన్నాడు. సిరీస్ను విజయంతో ప్రారంభించడం కీలకమన్నాడు. రాబోయే మ్యాచ్ల్లో కలిసికట్టుగా ఆడి విజయం సాధిస్తామన్నాడు.