హైదరాబాద్: పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత సౌమ్యజిత్ ఘోష్ చిక్కుల్లో పడ్డాడు. అతనిపై బుధవారం అత్యాచారం కేసు నమోదైంది. ఘోష్ తనను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ పద్దెనిమేదేళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
'గత మూడేళ్లుగా ఘోష్ నేను రిలేషన్లో ఉన్నాము. ఆ సమయంలో అతడు నాపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ, ఆ తర్వాత నిరాకరించాడు' అంటూ బాధితురాలు పోలీసులకు తెలిపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘోష్ సదరు యువతిని సోషల్ మీడియా ద్వారా 2014లో కలుసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెతో సంబంధాలు కొనసాగించాడు. తరుచుగా కోల్కతాలోని ఘోష్ ప్లాట్లో, తన స్వగ్రామమైన సిలిగురిలోని ఫ్లాట్లో వారిద్దరు కలుసుకునేవారు. ఓసారి ఆమె గర్భవతి కూడా అయిందని, బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని సమాచారం.
అంతేకాదు, వీరిద్దరు అనధికారికంగా ఓ ఆలయంలో వివాహం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ పెళ్లిని అతడు అంగీకరించడం లేదంట. బరాసత్ మహిళా పోలీస్ స్టేషన్లో ఈ మేరకు బాధితురాలు కేసు పెట్టింది. 24 ఏళ్ల ఘోష్ 2012, 2016 ఒలింపిక్స్లో భారత్ తరపున పాల్గొన్నాడు. 74వ జాతీయ టెన్నిస్ ఛాంపియన్షిప్లో టైటిల్ను 19 ఏళ్లకే గెలుచుకున్నాడు. ఈ టైటిల్ గెలిచిన అతి చిన్న వయస్కుడు కూడా ఇతడే.
ఈ విషయంపై అదనపు ఎస్పీ అభిజిత్ బెనర్జీ మాట్లాడుతూ... 'సౌమ్యజిత్పై మాకు ఫిర్యాదు అందింది. దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభించాం. దీనిపై ఇప్పుడే ఏం చెప్పలేము' అని తెలిపారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ సౌమ్యజిత్ నోరు విప్పలేదు.
సౌమ్యజిత్ ఘోష్ స్పందన:
ఈ ఆరోపణలపై స్పందించిన ఘోష్ ఇవన్నీ అబద్దాలని కొట్టిపరేశాడు. యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేల్చేశాడు. అంతేగాక, తనను కావాలనే సదరు యువతి బ్లాక్మెయిల్ చేస్తూ రేప్ ఆరోపణలకు దిగినట్లు ఘోష్ తెలిపాడు. 'నన్ను ఆ యువతి ఏడాది కాలంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ క్రమంలోనే నా నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేసింది. ఆమెకు రూ. లక్షకుపైగా ఇచ్చిన బిల్లు నా దగ్గర ఉంది. కోల్కతాలోని ఒక ఆస్పత్రిలో ఆ యువతి బంధువులకు ట్రీట్మెంట్ జరిగితే దానికి నేనే డబ్బులు కట్టా. అంతేకానీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడలేదు' అని తెలిపాడు.