ఇంచియాన్: ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని తీసుకోకుండా నిరసన వ్యక్తం చేసిన భారత బాక్సర్ ఎల్ సరితా దేవికి గట్టి హెచ్చరిక చేసి వదిలేశారు. దాంతో శిక్ష నుంచి ఆమె తప్పించుకుంది. పతక ప్రదాన వేదిక వద్ద ఆమె ప్రవర్తన తమకు నచ్చలేదని, అయితే బేషరతుగా ఆమె క్షమాపణ చెప్పిందని, అది పథకం ప్రకారం జరిగిన సంఘటన కాదని భారత ప్రతినిధులు నమ్మబలికారని ఆసియా ఒలింపిక్ మండలి (ఒసిఎ) వివరించింది.
గట్టి హెచ్చరిక చేసి సరితా దేవిని వదిలేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఒసిఎ గౌరవ లైప్ వైస్ ప్రెసిడెంట్ వీ జిజోంగా శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. సంఘటనతో భారత ప్రతినిధి బృందానికి ఏ విధమైన సంబంధం లేదని, అది క్రీడాకారిణి వ్యక్తిగత దుష్ప్రవర్తన మాత్రమేనని అన్నారు.
దక్షిణ కొరియాకు చెందిన పార్క్ జీ నా చేతిలో మంగళవారంనాడు లైట్వెయిట్ సెమీ ఫైనల్లో సరిత ఓడిపోయింది. దీంతో సరిత తీవ్ర ఆగ్రహానికి గురైంది. జడ్జిల నిర్ణయంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మర్నాడు తనకు ప్రదానం చేసిన కాంస్య పతకాన్ని ధరించడానికి సరిత నిరాకరించింది.
దాన్ని చేతిలో పట్టుకుని పార్క్కు ఇవ్వడానికి సరిత ప్రయత్నించింది. నిర్వాహకులు చెప్పినా ఆమె వినలేదు. తాను బాగా చేశానని సరిత అనుకున్నదని, కానీ మిగతా క్రీడాకారుల ఆనందాన్ని ఆమె చంపేసిందని, ఆమె క్షమాపణ చెప్పినందుకు సంతోషంగా ఉందని, ఇటువంటి సంఘటన మళ్లీ జరగకూడదని ఒసిఎ అధ్యక్షుడు షేక్ అహ్మద్ ఆల్ ఫహద్ ఆల్ - సబా అన్నారు. క్రీడాకారిణిగా రెఫరీల నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని అన్నారు.