చెన్నై: రియో పారాలింపిక్స్లో భారత్కు స్వర్ణం అందించిన మారియప్పన్ తంగవేలు కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలతో ఈ ఘనతను సాధించాడు తంగవేలు. అతను స్వర్ణ పతకం గెలవడానికి అతని శ్రమ ఎంత వుందో.. అతని తల్లి త్యాగం కూడా అంతే ఉంది.
పేదరికంలోనే పుట్టి.. : తంగవేలు కుటుంబ నేపథ్యం
తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన తంగవేలు జీవితం యువతరానికి స్ఫూర్తిదాయకమే. భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తెను విడిచిపెట్టి తంగవేలు తండ్రి ఎటో వెళ్లిపోయాడు. బాధ్యతల నుంచి భర్త దూరంగా పారిపోయినా, పిల్లలను సరోజ అంతా తానై పెంచింది. విద్యావంతురాలు కాకపోవడంతో కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషించింది.

ఆరోగ్యం దెబ్బతిని, కూలీకి వెళ్లలేని పరిస్థితి తలెత్తడంతో తంగవేలు ఎంతో కష్టం మీద 500 రూపాయలు అప్పు తెచ్చి, తల్లితో కూరల వ్యాపారం మొదలుపెట్టించాడు. కాయగూరలు అమ్ముతూ సరోజ సంపాదించేది రోజుకు సుమారు వంద రూపాయలు. ఈ మొత్తంతోనే ఆమె రోజులు నెట్టుకొచ్చింది. పేదరికం కారణంగా పెద్ద కుమారుడు వ్యాయామ విద్యను మధ్యలోనే ఆపేశాడు. రెండోవాడు తంగవేలు.
ఐదేళ్ల వయసులో ఒక ప్రభుత్వ వాహనం ఢీకొనడంతో అతను ఎడమ కాలిని కోల్పోయాడు. కాలులేని పిల్లవాడి భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న బెంగతో సరోజ అతనిని చదివించింది.
తల్లి పోరాట ఫలితం: 2లక్షల పరిహారం
ఐదేళ్ల వయసులో జరిగిన ప్రమాదంలో తంగవేలు ఒక కాలును కోల్పోవడంపై సరోజ సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చివరికి నష్టపరిహారంగా ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు చెల్లించింది. కాగా, ఈ మొత్తంలో లక్ష రూపాయలను ఆమె కోర్టు ఖర్చుల కింద చెల్లించింది.
తల్లి త్యాగం
మిగతా లక్షల రూపాయలను తంగవేలు పేరుతో డిపాజిట్ చేసింది. అందులో నుంచి ఒక్క పైసా సొంతానికిగానీ, కుటుంబానికిగానీ ఖర్చు చేయలేదు. చివరికి కుమార్తె వివాహ సమయంలోనూ అందులో నుంచి ఒక్క పైసా తీయలేదు. సరోజ చేసిన త్యాగమే తంగవేలు ఎదుగుదలకు, పారా అథ్లెట్గా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి ఉపయోగపడింది.
ఎన్నో అవమానాలు
తంగవేలు కుటుంబం ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. తల్లి, ఐదుగురు పిల్లలకు ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ఎవరూ సుముఖత చూపేవారుకారు. ఎక్కువ గదులు ఉన్న ఇంటికి కిరాయికి తీసుకునే ఆర్థిక స్తోమత సరోజకు లేదు. ఇప్పటికీ ఆమె కుటుంబం నెలకు ఐదు వందల రూపాయల అద్దెను చెల్లిస్తూ ఒక చిన్న గదిలోనే వీరితో జీవనం కొనసాగిస్తోంది.
కీలక ఘట్టం
ఎవిఎస్ కాలేజీలో బిబిఎ కోర్సు పూర్తి చేశాడు తంగవేలు. అక్కడ ఉన్నప్పుడే అతనిలో ఉన్న అథ్లెటిక్స్ లక్షణాలను అక్కడి ఫిజికల్ టీచర్ గుర్తించాడు. హై జంప్లో అతనే తంగవేలుకు శిక్షణనిచ్చాడు. కష్టపడే తత్వం ఉన్న తంగవేలు తక్కువ కాలంలోనే ఉన్నత ప్రమాణాలతో జాతీయ స్థాయిలో ఉత్తమ అథ్లెట్గా ఎదిగాడు.
చరిత్ర సృష్టించిన తంగవేలు: పారాలింపిక్స్లో స్వర్ణం, రూ.2కోట్ల నజరానా
బెంగళూరులోని 'డూ ఆర్ డై క్లబ్' అతని ప్రతిభను గుర్తించింది. నెలకు పదివేల రూపాయల స్టైఫండ్ను ఇస్తూ, శిక్షణనిప్పించింది. అక్కడ పొందిన శిక్షణే తంగవేలును ప్రపంచ మేటి పారా అథ్లెట్గా తీర్చిదిద్దడంలో కీలకంగా మారింది. తంగవేలు సాధించిన విజయంతో అతని కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా, తన తల్లిని, కుటుంబాన్ని ఆనందంగా ఉంచడమే తన బాధ్యత అని తంగవేలు తెలిపాడు.