రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో రెండో పతకం సాధించాలని కలలుగన్న భారత షూటర్ అభినవ్ బింద్రా కేవలం 0.5 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని గెలిచే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే... సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్ షూటౌట్లో 10 పాయింట్లు మాత్రమే గెలిచి నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.
రియో ఒలింపిక్స్: మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండినిలకడాగా రాణిస్తూ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించిన బింద్రా మొత్తం 16 షాట్స్తో 163.8 పాయింట్లు స్కోరు చేశాడు. ఇదే క్రమంలో ఉక్రెయిన్ షూటర్ సెర్హి కులిష్ కూడా సమాన పాయింట్లు సాధించడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో మూడో స్థానం కోసం ఇద్దరి మధ్య నిర్వహించిన షూటౌట్లో బింద్రా 10 పాయింట్లు గెలవగా, కులిష్ 10.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే తృటిలో బింద్రా కాంస్య పతకాన్ని కోల్పోవడం వెనుక ఓ ఊహించని ఘటన దాగుందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. రియో ఒలింపిక్స్ కోసం బింద్రా ప్రత్యేకంగా తయారు చేయించుకున్న గన్ సైట్ ఫైనల్కు ముందు విరిగిపోయిందట.

అదే భారత్ కోసం పతకం గెలవాలన్న బింద్రా ఆశయాలను అడియాశలు చేసింది. ఫైనల్కు ముందు బింద్రా తన రైఫిల్ను ఉంచిన టేబుల్ హఠాత్తుగా విరిగిపోవడంతో దానిపై ఉన్న అతని గన్సైట్ కూడా పగిలిపోయింది. అంతేకాదు ఒలింపిక్స్ క్వాలిఫయింగ్, ఫైనల్స్ జరిగే హాల్స్లో వెలుతురు వేరువేరుగా ఉంటుందని బింద్రా ముందుగానే తెలుసుకున్నాడు.
ఇందుకోసం ప్రత్యేకంగా బింద్రా ఓ గన్సైట్ను చేయించుకున్నాడు. అసలు సమయంలో అది విరిగిపోవడంతో తాను ఇండియాలో వాడిన గన్సైట్నే ఫైనల్స్లోనూ వాడాల్సి వచ్చింది. తాను అనుకున్నట్లే అక్కడి వెలుతురు బింద్రా అవకాశాన్ని దెబ్బతీసింది. చివరకు ఒలింపిక్స్లో పాల్గొన్న బింద్రాతోపాటు 120 కోట్ల మంది భారతీయులను నిరాశపరిచింది.
రియో ఒలింపిక్స్తో బింద్రాకు ఐదు ఒలింపిక్స్ను పూర్తి చేసుకున్నాడు. ఒలింపిక్స్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత పోడియం వద్దకు చేరుకున్న బింద్రా ఇకపై తాను రైఫిల్ పట్టనని తేల్చి చెప్పాడు. అంతేకాదు రియో ఒలింపిక్స్ తన చివరి ఒలింపిక్స్ అని, షూటింగ్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
రియో ఒలింపిక్స్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి'మీ మద్దతుకి ధన్యవాదాలు. నా శక్తి వంచన లేకుండా పోరాడా. అయినా సరే సరిపోలేదు. అయినప్పటికీ ఇదొక మంచి రైడ్' అని 33 ఏళ్ల బింద్రా షూటింగ్ అనంతరం ట్విట్టర్లో పోస్టు చేశాడు. 'నేను పూర్తి చేశాను. రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. దీని గురించి పునరాలోచించడం లేదు' అని పేర్కొన్నాడు.
కొన్ని వారాల పాటు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండనున్నట్లు బింద్రా ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.