మయన్మార్: క్యూ స్పోర్ట్స్ 'రారాజు' భారత చాంపియన్ ఆటగాడు పంకజ్ అద్వానీ మళ్లీ విశ్వవిజేతగా నిలిచాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్షిప్లో పంకజ్ విజయం సాధించాడు. ఇది కెరీర్లో అతడికి 22వ టైటిల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన 150-అప్ ఫైనల్లో పంకజ్ 6-2 (150-145, 151-66, 150-50, 7-150, 151-69, 150-0, 133-150, 150-75)తో నే తవే ఓ (మయన్మార్)పై విజయం సాధించాడు. గతేడాది జరిగిన ఫైనల్లోనూ వీళ్లిద్దరే తలపడ్డారు. ఆదివారం గత ఫైనల్కు రిపీట్గా జరిగిన పోరులో చిత్రంగా అదే ఫ్రేమ్ల (6-2) తేడాతో పంకజ్ గెలుపొందడం విశేషం.
తక్కువ సమయంలోనే నిరూపించుకోండి.. యువ ఆటగాళ్లకు కోహ్లీ సూచన!!
ఆరంభం నుంచి అదరగొట్టిన పంకజ్ ఓ దశలో 3-0తో ఎదురులేని ఆధిక్యం కనబరిచాడు. తవే కనీసం ఖాతా కూడా తెరువకముందే మూడు ఫ్రేమ్ల్లో పంకజ్ 145, 89, 127 పాయింట్లు సాధించడం విశేషం. విరామం అనంతరం కూడా పంకజ్ 63-0, 62-50 స్కోరుతో దూసుకెళ్లడంతో తవేకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఇదే ఊపులో పంకజ్ ఆఖరి ఫ్రేమ్ను 74-63తో గెలవడంతో ప్రపంచ విజేతగా నిలిచాడు.
బెంగళూరుకు చెందిన పంకజ్ పదేళ్ల వయసులో ఆట మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థానాలకు చేరుకున్నాడు. 18 ఏళ్ల వయసులో 2003లో తొలిసారి చాంపియన్షిప్ అందుకున్న పంకజ్.. తదనంతరం టైమ్ ఫార్మాట్లో 8 సార్లు, పాయింట్స్ ఫార్మాట్లో 6 సార్లు ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ సాధించాడు. స్నూకర్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన పంకజ్.. ప్రపంచ టీమ్ బిలియర్డ్స్, టీమ్ స్నూకర్లో ఒక్కోసారి విజయం సాధించాడు. ఇప్పటికే ప్రపంచ బిలియర్డ్స్ చరిత్రలో ఎక్కువ టైటిళ్లు సాధించిన రికార్డు పంకజ్ పేరిటే ఉంది.