టోక్యో: క్రీడా రంగంలో కోచ్, ప్లేయర్ మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కోచ్ తన అనుభవాన్ని, మెళుకువలను ఆటగాడికి పంచుతుంటాడు. ఇక మ్యాచుకు ముందు ఆటగాళ్లలో దైర్యం నింపుతారు. కొందరు కోచ్లు 'ఆల్ ది బెస్ట్' చెపుతారు. మరికొందరు షేక్ హ్యాండ్, హగ్ ఇచ్చి మద్దతు తెలుపుతారు. కానీ ఓ కోచ్ మాత్రం వీటన్నింటికి బిన్నంగా ప్రవర్తించాడు. మ్యాచ్కు ముందు ప్లేయర్ను లాగిపెట్టి కొట్టాడు. ఈ ఘటన జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ 2020లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...
టోక్యో ఒలింపిక్స్ 2020లో రౌండ్ ఆఫ్ 32 ఎలిమినేషన్ జూడో మ్యాచ్లో తలపడటానికి జర్మనీకి చెందిన స్టార్ అథ్లెట్ మార్టినా ట్రాజ్డోస్ రింగ్ వద్దకు వచ్చింది. ఆమెతో పాటు కోచ్ క్లాడియు పూసా కూడా అక్కడికి వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం హంగేరీకి చెందిన స్జోఫీ ఓజ్బాస్పై ట్రాజ్డోస్ రౌండ్ 32 పోరాటానికి సిద్ధమైంది. ట్రాజ్డోస్ రింగ్లోకి వెళ్లే ముందు.. తన వెంటే ఉన్న కోచ్ క్లాడియు పూసా రెండు చేతులతో ఆమె కాలర్ పట్టుకొని షేక్ చేశాడు. ఆపై లాగి రెండు చెంపలపై వాయించాడు. అనంతరం ట్రాజ్డోస్ రింగ్ లోపలికి వెళ్ళిపోయింది.
కోచ్ చేసిన పని చూసిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. కెమెరాల ముందే ఈ కోచ్ ఏంటి ఇలా చేస్తున్నాడని అంతా ముక్కున వేలేసుకున్నారు. అయితే ఆ చెంపదెబ్బలు తిన్న మార్టినా ట్రాజ్డోస్ మాత్రం ఇది కామనే అని చెప్పడం విశేషం. ఫైట్కు ముందు కోచ్ ఇలా చేయడం ఆనవాయితీ అని ఆమె చెప్పడం మరింత షాక్కు గురి చేసింది. అది కూడా తాను చెప్పడం వల్లే కోచ్ అలా చేస్తున్నాడని ట్రాజ్డోస్ చెపుకొచ్చింది. ఫైట్కు ముందు తాను యాక్టివ్గా ఉండటానికి ఇది తనకు అవసరం అని ఆమె పేర్కొంది. ట్రాజ్డోస్ చెంప దెబ్బలకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు కోచ్పై మండిపడుతున్నారు.
A czo tu się odpoliczkowało w ogóle?! pic.twitter.com/mX2r9rMMTA
— Mischa Von Jadczak (@michaljadczak) July 27, 2021
ఒలింపిక్స్ 2021లో ఒకవైపు ఆటలు సాగుతున్నా.. మరోవైపు ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో వేర్వేరు దేశాలకు చెందిన అథ్లెట్లు ఈ మహమ్మారి బారిన పడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి నిర్వాహకులు.. ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎప్పుడూ లేనంతగా ఈరోజు కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం సాయంత్రం టోక్యో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 24 గంటల వ్యవధిలో రాజధానిలో 3,865 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది ఆల్టైమ్ హై. రికార్డు స్థాయిలో కొత్త కేసులు పుట్టుకుని రావడం టోక్యో అధికార యంత్రాంగాన్ని ఉలికిపడేలా చేస్తోంది.