ఢిల్లీ: మ్యాచ్ ఆడుతుండగా కాలు విరిగినా సరే.. పతకం గెలవాలనుకున్నా అని భారత స్టార్ రెజ్లర్, బ్రాంజ్ మెడలిస్ట్ బజరంగ్ పునియా తెలిపాడు. పతకమైతే గెలవాలన్న కసితో కాంస్య పతక పోరులో ఆడాడని చెప్పాడు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020లో మోకాలి గాయం కారణంగానే సెమీస్లో బజరంగ్ ఓడిన విషయం తెలిసిందే. 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ సెమీస్లో బజరంగ్ అజర్ బైజానికి చెందిన హాజీ అలియెవ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. టోక్యో నుంచి సోమవారం స్వదేశానికి తిరిగొచ్చిన బజరంగ్ పునియాకు ఘన స్వాగతం పలికారు. కొంత రెస్ట్ తీసుకున్న బజరంగ్ వరుసగా మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నాడు.
IND Vs ENG 2nd Test: జో రూట్ హాఫ్ సెంచరీ.. బెయిర్స్టో బాదుడు! ఇంగ్లండ్ స్కోర్173/3!
తాజాగా ఓ జాతీయ మీడియాతో బజరంగ్ పునియా మాట్లాడుతూ... 'ఒలింపిక్స్ 2020కు ముందు నా కుడి మోకాలికి గాయమైంది. దీంతో విశ్వ క్రీడల్లో ఆడటంపై సందిగ్ధత ఏర్పడింది. డాక్టర్ల సూచనలతో టోక్యోలో మ్యాచ్లు ఆడాను. వారు నా మోకాలికి పట్టీలు ఇచ్చారు.ప్లేఆఫ్కు మ్యాచ్లకు కాలికి పట్టీ ధరించి ఆడాల్సి వచ్చింది. దీంతో నా ఫుట్వర్క్ కదలికలకు అడ్డంకి ఏర్పడింది. అందుకే సెమీస్లో ఓడిపోయాను. దీంతో కాంస్య పతక పోరులో నేను పట్టి లేకుండానే బరిలోకి దిగాలని నిశ్చయించుకున్నాను. కాలి గాయం ఎక్కువైనా సరే.. పతకమైతే గెలవాలనుకున్నా. చివరికి కాలు విరిగితే సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడ్డాను' అని తెలిపాడు.
'సెమీస్లో హజీ అలియెవ్ చేతిలో ఓటమి తర్వాత నా గదిలోకి వెళ్లి త్వరగా పడుకున్నా. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించలేదు. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి అమ్మతో చాలా సమయం మాట్లాడా. రెజ్లింగ్ కన్నా ఎక్కువగా నా గాయం గురించే అమ్మ భయపడుతున్నట్టు చెప్పింది. గెలుపోటములు ఆటలో భాగమంది. ముందు నా మోకాలిని రక్షించుకోవాలని సూచించింది. పతకం కన్నా నా ఆరోగ్యమే ముఖ్యమని అమ్మ చెప్పింది' అని బజరంగ్ పూనియా అన్నాడు.
'పిల్లలు మెడల్స్ గెలవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. గాయంతోనే గెలిచిన ఈ కాంస్యం తమకు బంగారంతో సమానమని నా కుటుంబ సభ్యులు అన్నారు. ఎందుకంటే గాయం వల్ల నేను రష్యాలో 20-25 రోజులు మ్యాటుకు దూరమయ్యాననే విషయం వారికి తెలుసు. పతకం వచ్చినందుకు వారు చాలా ఆనందించారు' అని బ్రాంజ్ మెడలిస్ట్ బజరంగ్ పునియా వెల్లడించాడు.
ఒలింపిక్స్ 2002కు ముందు రష్యా వేదికగా జరిగిన అలీ అలియేవ్ టోర్నీ సందర్భంగా స్థానిక రెజ్లర్ అబుల్మాజిద్ కుదియేవ్తో పోరులో బజ్రంగ్ గాయపడ్డాడు. అతిపెద్ద ఈవెంట్కు ముందు గాయం బారిన పడటం వల్ల కొంత నిరాశకు లోనయ్యాడు. ఒలింపిక్స్లో చాలామంది ఒత్తిడి కారణంగానే ఓడిపోతుంటారు. దీంతో పతకం గెలవాలంటే ఒత్తిడిని దరిచేరనీయకూడదని పూనియా సంకల్పించాడు. ఆ సూత్రాన్ని విజయవంతంగా పాటించి ఒలింపిక్స్ 2020లో పతకం సాధించాడు.