హైదరాబాద్: కొరియా ఉభయ దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడనున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో ఇండోనేషియా వేదికగా ఆసియా గేమ్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్స్లో కొరియా దేశాలు విడివిడిగా కాకుండా ఒకే జెండా కింద పాల్గొనున్నాయి.
కొరియాకు చెందిన న్యూస్ ఏజెన్సీ యోన్హప్ ప్రకారం పాన్ముంజామ్ గ్రామంలో ఇరు దేశాలకు చెందిన క్రీడా ఉన్నతాధికారులు భేటీ అయి దీనిపై ఓ కీలక ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు గాను క్రీడలను ఉపయోగించుకోనున్నట్లు పేర్కొంది.
ఈ ఒప్పందంలో భాగంగా ఆసియా గేమ్స్ ఆరంభ, ముగింపు వేడుకల్లో ఇరు దేశాలకు చెందిన అథ్లెట్లు ఒకే జెండాతో మార్చ్ చేయనున్నారు. ఆగస్టులో జరిగే ఆసియా గేమ్స్ ఆరంభ వేడుకలకు ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికకాగా, ముగింపు వేడుకలకు పాలెంబ్యాంగ్ వేదికగా జరగనున్నాయి.
అంతేకాదు, ఆసియా గేమ్స్లోని కొన్ని ఈవెంట్లలో ఒకే జట్టుతో బరిలోకి దిగనున్నాయి. ఈ ఏడాది ప్యాంగ్ చాంగ్ వేదికగా జరిగిన వింటర్ ఒలింపిక్స్లో కొన్ని ఈవెంట్లలో ఇరు దేశాలు ఒకే జట్టుగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇరు దేశాల మధ్య జులై 4న చారిత్రక ఈవెంట్ జరగనుంది.
ఇందుకు ప్యాంగ్ చాంగ్ వేదిక కానుంది. దక్షిణ కొరియా రాజధాని ప్యాంగ్ చాంగ్లో జులై 4న ఇరు దేశాల మధ్య ఫ్రెండ్లీ బాస్కెట్ బాల్ మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 27న దక్షిణ కొరియా లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు మూన్తో భేటీ అయిన సందర్భంగా ఈ ప్రతిపాదనను చేశారు.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గి, స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. ముఖ్యంగా కల్చర్, క్రీడలు, టూరిజం లాంటి విభాగాల్లో ఇరు దేశాలు పూర్తిగా సహకరించుకుంటున్నాయి.