మరో 16 మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్!!

ఫ్లోరిడా: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే మూడు నెలలకు పైగా క్రీడా లోకం స్తంభించిపోయింది. అన్ని దేశాల్లో లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పలు క్రీడా సంఘాలు, సమాఖ్యలు ఆటలను పునఃప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా ఆటగాళ్లకు నిర్వహిస్తున్న కరోనా వైరస్ పరీక్షల్లో పలువురు వైరస్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ టూర్ కోసం వెళ్లే 29 మంది పాకిస్తాన్ ఆటగాళ్లకు టెస్టులు నిర్వహించగా.. 10 మందికి పాజిటివ్ అని తేలింది. ఇక అడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీ ఆడిన టాప్ టెన్నిస్ ఆటగాళ్లకు కరోనా సోకింది.
తాజాగా నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లోనూ 16 మంది ఆటగాళ్లు ప్రమాదకర వైరస్ బారిన పడ్డారు. ఈనెల 23న మొత్తం 302 మంది తమ ఆటగాళ్లకు నిర్వహించిన పరీక్షల్లో 16 మందికి పాజిటివ్గా నిర్ధరణ అయిందని ఎన్బీఏ సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే వైరస్ బారిన పడిన ఆటగాళ్ల పేర్లను మాత్రం బయటకి రాకుండా చూసుకుంది.
మరోవైపు వచ్చేనెల 30 నుంచి ఫ్లోరిడాలోని డిస్నీ వరల్డ్లో కొత్త సీజన్ను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఎన్బీఏ సంఘం చెప్పింది. ఎన్బీఏలో మొత్తం 30 జట్లు ఉండగా.. 22 జట్లతోనే ఆడించాలనుకుంటున్నట్లు తెలిపింది. టోర్నీలో ఆడే ఆటగాళ్లను డిస్నీ రిసార్ట్లోనే ఉంచుతూ.. అక్కడే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎన్బీఏ కమిషనర్ ఆడమ్ సిల్వర్, నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిచెల్ రాబర్ట్స్, ఎన్బీఏ అధ్యక్షుడు క్రిస్ పాల్ లీగ్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పనామా బాక్సింగ్ దిగ్గజం, ఆరుసార్లు ప్రపంచ విజేత అయిన రాబెర్టో డురాన్ (69) వైరస్ సోకడంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఆయన కుమారులు వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదైన రోజే ఆయన ఆసుపత్రిలో చేరడం గమనార్హం. 'మా నాన్న పరీక్ష ఫలితాలు ఇప్పుడే వచ్చాయి. వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. నాన్నలో జలుబు తప్ప మరెటువంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం ఆయన అబ్జర్వేషన్లో మాత్రమే ఉన్నారు. ఐసీయూలో లేరు' అని డురాన్ కుమారుడు రాబిన్ డురాన్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications