హైదరాబాద్: ఇటీవలే వరల్డ్ ర్యాపిడ్ చెస్లో ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ ఆ గొప్పదనమంతా శ్రీమతికే ఆపాదిస్తున్నాడు. ఈ వయస్సులో కూడా తాను పాల్గొనడానికి కారణం తన భార్య ఇచ్చిన ప్రోత్సాహమే అంటున్నాడు. తొలినాళ్లలో ఈ పోటీల్లో పాల్గొనడాన్ని దాటేసిన ఆనంద్ ఈ సారి ఎందుకు పాల్గొన్నాడో అతని మాటల్లో...
'ఇంతకుముందు లండన్లో జరిగిన రెండు టోర్నమెంట్లు ఘోరంగా ఓడిపోవడంతో నేను హాలీడే టూర్ కోసమని కేరళ వెళ్లేందుకు నిశ్చయించుకున్నాను. లండన్ టోర్నమెంట్ ఘోర వైఫల్యానంతరం అటునుంచి అటే స్పెయిన్లో ఉన్న నా ఫ్రెండ్తో కలిసి టూర్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యాను.'
'సరిగ్గా అదే సందర్భంలో అంతర్జాతీయ సమాఖ్యకు చెందిన ఓ ప్రతినిధి నన్ను వరల్డ్ ర్యాపిడ్ చెస్లో పాల్గొనమంటూ ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఆ విషయం తెలిసిన నా శ్రీమతి అరుణ నిదానంగా నా మనసు మార్చే ప్రయత్నం చేసింది. కొన్ని రోజుల తర్వాత నేను ఆడాలని నిర్ణయం మార్చుకోవడం, విజేత అవడం అంతా చాలా బాగా జరిగింది.' అంటూ విశ్వనాథన్ ఆనంద్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
ఇంకా మాట్లాడుతూ.. 'గేమ్ టై బ్రేక్ పడిన సమయంలో నా భార్యకు ఫోన్ చేశాను. ఆఖరి రౌండ్ ముగించిన వారిలో నేనే ముందున్నానని చెప్పా. ప్రత్యర్థులు గురించి ఆలోచిస్తే టెన్షన్గా ఉందన్న భావనను తన ముందుంచా' అని అన్నారు.
దానికి స్పందించిన ఆమె అస్సలు కంగారు పడవద్దు. నీ ఏకాగ్రతను కోల్పోవద్దు అంటూ సలహా ఇచ్చిందట. టై బ్రేక్ తర్వాత ఆడిన ఆటలో ఆనంద్ ప్రత్యర్థి ఫెడొసివ్ని చిక్కుల్లో పడేసి గెలిచిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.