వరుసగా మూడో రోజు రికార్డ్ స్థాయిలో
గురువారం సాయంత్రం టోక్యో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 24 గంటల వ్యవధిలో రాజధానిలో 3,865 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది ఆల్టైమ్ హై. వేల సంఖ్యలో కరోనా వైరస్ కొత్త కేసులు పుట్టుకుని రావడం వరుసగా మూడోసారి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత ఈ ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కాలేదు. ఒలింపిక్స్ ఆరంభమైన వారం రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు పుట్టుకుని రావడం టోక్యో అధికార యంత్రాంగాన్ని ఉలికిపడేలా చేస్తోంది.
టోక్యోలో కరోనా పుట్ట..
ఈ నెల 27వ తేదీన టోక్యోలో 2,848 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే రికార్డ్ అనుకుంటే.. 28న ఈ సంఖ్య మరింత పెరిగింది. మూడు వేల మార్క్ను దాటింది. బుధవారం నాడు 3,177 కేసులు రికార్డయ్యాయి. రోజు దాటే సరికి ఈ సంఖ్య మరింత పెరిగింది. జపాన్ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం సాయంత్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. కొత్తగా 3,865 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మంగళ, బుధ, గురు వారాల్లో 9,890 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికార యంత్రాంగం తెలిపింది.
ఇక్కడితో ఆగకపోవచ్చు..
ఈ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎప్పుడూ నమోదు కాలేదు. ఇప్పటిదాకా గరిష్ఠంగా ఒక్క రోజు వ్యవధిలో 7,958 కేసులు మాత్రమే రికార్డయ్యాయి. ఇది ఇక్కడితో ఆగకపోవచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. దీనితో కొత్త కేసులు అధిక సంఖ్యలో నమోదైన ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను విధించారు. టోక్యో ఒలింపిక్స్ విలేజ్లో ఇప్పటికే 155 కేసులు నమోదయ్యాయి. ఒలింపిక్స్తో ముడిపడి ఉన్న ఏడుమంది కొత్తగా కరోనా వైరస్కు గురయ్యారు. ఇప్పటిదాకా పలువురు అథ్లెట్లు, సపోర్టింగ్ స్టాఫ్ కరోనా బారిన పడ్డారు.
అత్యవసర పరిస్థితులు, హైఅలర్ట్..
టోక్యోలో ఆదివారం నాడు ఒక్కరోజులోనే 12,635 మంది కోవిడ్ పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరారు. ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్ల ఆక్యుపెన్సీ రేషియో 20.8 శాతంగా నమోదైంది. 25 శాతం మేర కొత్త కేసులు నమోదైన ప్రతి ప్రాంతంలోనూ అత్యవసర పరిస్థితులను విధించాల్సి ఉంటుందని జపాన్ ప్రభుత్వం నియమించిన కోవిడ్ అడ్వైజరీ ప్యానెల్ సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా టోక్యలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. కరోనా కేసులు పెరగడం, ఒలింపిక్స్ కొనసాగుతుండటం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
కరోనా సగటు రెట్టింపు..
టోక్యో ఒలింపిక్స్ విలేజ్లోకి ఎవ్వరినీ ప్రవేశించనివ్వట్లేదు. కమిటీ అధికారికంగా నియమించుకున్న వలంటీర్ల సంఖ్యను కూడా పరిమితం చేశారు అధికారులు. అలాగే- ఆసుపత్రుల్లో బెడ్స్ సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడున్న 5,967 బెడ్స్ సంఖ్యను వచ్చే వారం నాటికి 6,406కు పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ముందు రోజువారీ జపాన్ కొత్త కేసుల సగటు సంఖ్య 1,373. ఒలింపిక్స్ ప్రారంభమైన తరువాత ఈ సంఖ్య 2,241కి చేరింది. టోక్యో శివార్లోని కనగవ, చీబా, సైటామాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.