
ఢిల్లీ: భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్ పీటీ ఉష ఈరోజు 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. 'పరుగుల రాణి' పీటీ ఉష జూన్ 27, 1964లో జన్మించారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీలో ఆమె జన్మించారు. అందుకే ఉషను 'పయోలి ఎక్స్ప్రెస్' అని పిలుస్తుంటారు. పుట్టినరోజు సందర్భంగా భారత మాజీ అథ్లెట్ పీటీ ఉషకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. పీటీ ఉషకు శుభాకాంక్షలు తెలిపారు. 'భారతీయ ట్రాక్ అండ్ పరుగుల రాణి పీటీ ఉష గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అద్భుతమైన విజయాలను చూస్తూ పెరిగాను. భారతీయులుగా ఇది మాకు చాలా గర్వకారణం. యువతను ప్రోత్సహించడానికి మీరు అంకితభావంతో స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలి' అని యువరాజ్ ట్వీట్ చేశారు.
'లెజెండ్, భారతదేశ అసలైన గోల్డెన్ గర్ల్ పీటీ ఉషకు జన్మదిన శుభాకాంక్షలు. యువ అథ్లెట్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆమె ఇప్పటికీ భారత క్రీడలకు తోడ్పడుతూనే ఉన్నారు. మీరు సాధించిన ఘనతలు దేశానికి గర్వకారణం. ఆమెకు దీర్ఘకాలపు ఆరోగ్యం సిద్ధించాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. అంతేకాదు పీటీ ఉషతో ఉన్న ఫొటోలను పోస్టుకు జత చేశారు.
పీటీ ఉష 1979 నుంచి భారతదేశం తరపున అథ్లెటిక్స్లో పాల్గొని దేశానికి పలు అద్భుత విజయాలను అందించారు. 1986 సియోల్ ఆసియా క్రీడల్లో 4 బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించారు. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో కూడా 2 రజత పతకాలు కైవసం చేసుకున్నారు. 1990 ఆసియాడ్లో 3 రజిత, 1994 ఆసియాడ్లో ఒక రజిత పతకం సాధించారు. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతుతో కాంస్య పతకం లభించే అవకాశాన్ని చేజార్చుకున్నారు.
పయోలీలో జన్మించిన పీటీ ఉష 1976లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశాలలో కోజికోడ్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి అందులో చేరారు. 1979లో ఉష జాతీయ స్థాయి పాఠశాల క్రీడలలో పాల్గొన్నారు. అప్పుడే ఆమెలోని నైపుణ్యాన్ని కోచ్ నంబియార్ పసిగట్టాడు. అప్పటి నుంచి ఆమెకు చాలా కాలం వరకు అతడే కోచ్గా శిక్షణ ఇచ్చాడు. 1980 రష్యా ఒలింపిక్స్ లో పాల్గొన్నా ఆమెకు అది అంతగా కలిసిరాలేదు. ఉష అంతర్జాతీయ క్రీడా జీవితంలో మొత్తం మీద 101 స్వర్ణ పతకాలను సాదించారు. అర్జున అవార్డు, పద్మశ్రీ బిరుదు, పలు ఉత్తమ అథ్లెట్ అవార్డులను ఆమె సాధించారు.