
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా గేమ్స్లో భారత్కు మూడు పతకాలు అందించి దేశం గర్వపడేలా చేసింది స్ప్రింటర్ హిమదాస్. జకార్తా నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న ఏషియాడ్ పతక విజేతలు ప్రధాని మోడీని కలిసిన అనంతరం తమ సొంత రాష్ట్రాలకు పయనమయ్యారు.
ఈ క్రమంలో హిమదాస్ ఆమె తన స్వస్థలమైన గౌహతికి శుక్రవారం చేరుకోనున్నారు. హిమదాస్ను అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనవాల్ సాదరంగా ఆహ్వానించనున్నారు. భారత్కు మూడు పతకాలు సాధించి పెట్టిన హిమదాస్కు వినూత్నంగా స్వాగతం పలకాలని నిర్ణయించారు.
దీంతో అసోం విమానాశ్రయంలో ఎర్ర తివాచీ వేసి దానిపై స్టార్ట్ 1,2,3,4,5,6 అన్న సంఖ్యలతో ట్రాక్ను రూపొందించారు. ఆసియా గేమ్స్లో హిమదాస్ ఇలాంటి ట్రాక్పైనే పరిగెత్తి పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి ట్రాక్నే రూపొందించడంతో... ఈ వీడియా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గౌహతికి చేరుకున్నాక హిమదాస్ను శ్రీమంత శంకరదేవ్ కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. ఆసియా గేమ్స్ మహిళల 400మీ పరుగులో హిమదాస్ భారత్కు పతకం అందించింది. ఆసియా గేమ్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్డ్ 4×400 ఈవెంట్లో భారత జట్టు రజత పతకం గెలుచుకుంది.
మొహమ్మద్ అనస్ యహియా, పూవమ్మ, హిమ దాస్, అరోకియా రాజీవ్లతో కూడిన భారత జట్టు మూడు నిమిషాల 15.71 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. తొలి లెగ్లో అనస్ అద్భుతంగా పరుగెత్తి ముందంజలో నిలవగా, పూవమ్మ దానిని కొనసాగించింది.
అంతకముందు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో మరో రెండు సిల్వర్ మెడల్స్ తీసుకొచ్చారు హిమ దాస్ మహిళల 400 మీటర్ల ఈవెంట్లో రజత పతకం సాధించింది. నేషనల్ రికార్డు టైమ్ 50.79 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె.. రెండోస్థానంలో నిలిచింది. 51 సెకన్లలోపు 400 మీటర్ల రేసు పూర్తి చేసిన తొలి ఇండియన్గా హిమ దాస్ రికార్డు సృష్టించింది.
అంతకముందు ఐఏఏఎఫ్ ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్గా హిమదాస్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.