హైదరాబాద్: ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో స్వర్ణాలు గెలిచినందుకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆవులను తిరిగి ఇచ్చేస్తున్నారు. గువహటి వేదికగా జరిగిన యూత్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో నీతూ, సాక్షి, జ్యోతి, శశి స్వర్ణాలు గెలువగా, అనుపమ, నేహా కాంస్యాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ అద్భుత ప్రదర్శనకు మెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వీళ్లకు పురస్కారం కింద మేలు జాతి దేశీ ఆవులను బహూకరించింది. అంతేకాదు శారీరక పుష్టి కోసం ఆవు పాలు తాగితే మంచిదనే ఉద్దేశాన్ని బాక్సర్లు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జ్యోతి గులియా, సాక్షి చౌదరి, నీతు గాంగాస్లకు తలో ఓ ఆవుని హర్యానా ప్రభుత్వం ఇచ్చింది.
తీసుకున్న ఆవులను కట్టేయడానికి ఇంట్లో స్థలం చాలకపోవడంతో పాటు రోజూ ఓ కుటుంబ సభ్యుడ్ని గాయపరుస్తున్నాయి. దీనికితోడు పాలు కూడా ఇవ్వడం లేదంట. దీంతో ఆ మహిళా బాక్సర్లు మీ ఆవులు మాకొద్దు అంటూ గత నవంబర్లో ప్రభుత్వం ఇచ్చిన ఆవుల్ని తిరిగి అప్పగించారు.
'మా అమ్మ ఐదు రోజులపాటు ఆవుకు మేత పెట్టారు. పాలు పితకడానికి వెళ్లిన మా అమ్మను తన్నడంతో కిందపడి చేయి విరిగింది. ఇంటి పక్కన ఉన్న వాళ్లని పిలిచినా అతనిపైనా దాడి చేసింది. మా వద్ద ఉన్న గేదెలు చాలు అని సంతృప్తి పడుతూ వెంటనే మేము ఆవును తిరిగి ఇచ్చేశాం' అని బాక్సర్ జ్యోతి సోదరుడు ధరంభీర్ గులియా వెల్లడించాడు.
మరోవైపు ఇతర బాక్సర్లు నీతు, సాక్షిలకు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తడంతో వారూ ఆవులను తిరిగిచ్చేశారు.