హైదరాబాద్: ఆస్ట్రేలియాలో జరిగిన జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన హైదరాబాదీ అమ్మాయి బుడ్డా అరుణారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడల మంత్రి పద్మారావు ఘనంగా సత్కరించారు. శనివారం లాల్బహదూర్ స్టేడియంలో తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ(సాట్స్), తెలంగాణ ఒలింపిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఆమెను ఘనంగా సన్మానించిన మంత్రి పద్మారావు... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల చెక్ను అందించారు. అనతంరం ఆయన మాట్లాడుతూ 'దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన అరుణ.. తెలంగాణకే గర్వకారణమని.. ఆమె అందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది' అని అన్నారు.
భవిష్యత్లో అరుణ ఏ టోర్నీలకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని ఆయన తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో అరుణ పతకం గెలవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, అంతర్జాతీయస్థాయిలో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన అరుణకు స్పాన్సర్షిప్ లభించింది. సువర్ణ అవని ఎస్టేట్ ఇండియా లిమిటెడ్ అరుణను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది.
ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ కుమార్ అంబాసిడర్ నియామకాన్ని ప్రకటించారు. అంతేకాదు సువర్ణవాణి ఎస్టేట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఆ సంస్థ ఎండీ సురేందర్ కుమార్, శంషాబాద్ సమీపంలోని కొత్తూరులో సిటీ గేటెడ్ కమ్యూనిటీలో నిర్మించిన రూ.50లక్షల విల్లాను బహుమతిగా అందించారు.
ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ ఏ వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర క్రీడల కార్యదర్శి బుర్ర వెంకటేశం, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు కే రంగారావు, ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమ్రాజ్, ముఖ్య కార్యదర్శి (స్పోర్ట్స్) బుర్రా వెంకటేశం, అరుణ తల్లి సుభద్రమ్మ, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.