ఢిల్లీ: తనకు ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్లు అంటే అంత ఆసక్తి ఉండదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురువారం నాడు చెప్పారు. అయితే, వన్డే మ్యాచులు, టెస్ట్ క్రికెట్ మ్యాచులు అంటే తనకు చాలా ఆసక్తి అని చెప్పారు. ఫుట్బాల్, క్రికెట్ మ్యాచులు చూస్తానని చెప్పారు.
ఎంటర్ ప్రిన్యూయర్లలో మంచి ఉత్సాహం కనిపిస్తోందన్నారు. వచ్చే తరానికి క్రియేటివిటీ అన్నదే ప్రధాన అంశమని చెప్పారు. విద్యార్థులారా! కొంచెం రిస్క్ తీసుకోండి అని పిలుపునిచ్చారు. రిస్క్ వల్ల ఇబ్బందులతో పాటు విజయం కూడా వరిస్తుందని చెప్పారు.
సిలికాన్ వ్యాలీకి, ఢిల్లికీ తేడా లేదని చెప్పారు. అకడమిక్ చదువు కంటే క్రియేటివిటీ ముఖ్యమని చెప్పారు. మనం ఏం చదువుతున్నామో దానిని ఇష్టపడాలన్నారు. కొత్తగా ప్రారంభించేందుకు యువత ఉత్సాహం చూపిస్తోందన్నారు. భారత్లో స్టార్టప్ కంపెనీలు ఊపందుకున్నాయని తెలిపారు.
భారత్ పైన తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని చెప్పారు. ఇక్కడ అద్భఉతమైన యువశక్తి ఉందన్నారు. గూగుల్ కూడా అద్భుతాలకు కేంద్రం అని తెలిపారు. సాంకేతికతతో అందర్నీ అనుసంధానం చేస్తామని సుందర్ పిచాయ్ ఈ సందర్భంగా తెలిపారు.
తాను తొలిసారిగా గూగుల్లో అడుగుపెట్టిన సమయంలో చిన్నపిల్లాడు ఓ మిఠాయి కొట్టుకు వెళ్లినంత సంబరపడ్డానన్నారు. తన మనసులో ఏం ఆలోచనలు ఉండేవో, వాటిని నెరవేర్చుకునేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులూ అక్కడ తనకు దగ్గరయ్యానన్నారు.
1980వ దశకంలో మద్రాసులో తాను పెరిగానని, ఓ టెస్టు మ్యాచ్ కూడా చూశానని తెలిపాడు. భవిష్యత్తులో మరిన్ని టెక్ అద్భుతాలను ప్రపంచం ముందు తమ గూగుల్ సంస్థ ఉంచుతుందని చెప్పారు. ఆయన ఢిల్లీలోని శ్రీరాం కాలేజీలో విద్యార్థులతో మాట్లాడారు.