ముంబై: భారతీయ ఫుట్బాల్పై ఇండియన్ సూపర్లీగ్ (ఐఎస్ఎల్) అగ్రభాగాన కొనసాగుతుందని అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (ఫిపా) అధ్యక్షుడు జియాన్ని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు నెలల నిడివితో సాగుతున్న ఐఎస్ఎల్ టోర్నీలో మరికొన్ని ఫ్రాంచైసీలను కలుపుకొనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. టెండరింగ్ పద్ధతిలో కొత్త జట్లను లీగ్లోకి తీసుకోవాలని ఆయన వివరించారు. ఐఎస్ఎల్ను దీర్ఘకాలిక దృష్టితో కొనసాగించాల్సి ఉంటుందన్నారు.
భారత్లో ఫుట్బాల్ అభివృద్ధి చెందాలన్నా, ప్రాచుర్యం లభించాలన్నా ముందు అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యమని మీడియాతో అన్నారు. 'ఐ - లీగ్' భారత ఫుట్బాల్ సమాఖ్య అధికారిక లీగ్గా కొనసాగుతున్నదన్నారు. అదే సమయంలో ఐఎస్ఎల్ కూడా గణనీయ విజయాలు సాధించిందని ప్రశంసించారు. ఫుట్బాల్ సమాఖ్య, జట్ల సభ్యులతో తాను జరిపే చర్చలు, సంప్రదింపుల్లో రాజీకి తావులేకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తామన్నారు.
'చరిత్రాత్మక క్లబ్ల వారసత్వాన్ని పరిరక్షిస్తూ వాటికి సమతూకంలో ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. ఆట పురోభివృద్ధికి సరైన దిశలో ప్రయాణించాలంటే సంబంధిత ప్రయోజనాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి. అవసరమైన చోట ఫిఫా తనవంతు సహకారం అందిస్తుంది. ఆ విషయమై నాకు నమ్మకం ఉంది' అని అన్నారు.
వచ్చే ఏడాది నుంచి భారత్ ఫుట్బాల్ మూడు లీగ్ల పిరమిడ్గా ఉంటుందని, క్షేత్రస్థాయిలో నిర్వహించే పోటీలకు 'లీగ్ 2' ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. 'లీగ్ 2' జట్లన్నీ నేరుగా 10 జట్లతో కొత్తగా ఏర్పాటయ్యే 'ఐ - లీగ్'కు రెండో డివిజన్గా ప్రతిస్పందిస్తాయని తెలిపారు. ప్రమోషన్ల గ్యారంటీ ఉంటే ప్రతి జట్టు కూడా అగ్రస్థానంలో నిలుస్తుందన్నారాయన. ఇక అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ఇప్పటివరకు ఫుట్బాల్ ప్రాతినిధ్యం లేని బీహార్, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జట్ల తయారీపై దృష్టి సారించాలని జియాన్నో సూచించారు.
భారత్లో ఫుట్బాల్ అభివృద్ధికి నూతన టాప్ టైర్ లీగ్లో ఎన్ని జట్లకు ప్రాతినిధ్యం కల్పించాలన్న విషయం ఇంకా చర్చకు రాలేదన్నారు. భారత జనాభాను పరిగణనలోకి తీసుకున్నా దేశీయ క్రీడల్లో ఫుట్బాల్ను నంబర్వన్ ఆటగా తీర్చిదిద్దాలని తాను కోరుకుంటున్నానన్నారు. అందుకోసం ఎఐఎఫ్ఎఫ్తో కలిసి ఫిఫా అవసరమైన చర్యలన్నీ తీసుకుని అద్భుతమైన అందమైన ఫుట్బాల్ ఆటను భారత్లో అభివృద్ధి చేస్తామని స్పష్టంచేశారు.
ఇప్పటికే భారతీయుల ప్రధాన ఆటల్లో ఫుట్బాల్ ఒకటిగా ఉందని, యువత అంతా ఎక్కువగా ఈ ఆటనే ఇష్ట పడుతున్నారన్నారు. ఆట పురోభివృద్ధికి రూపొందించిన 'మిషన్ 11 మిలియన్' థీమ్ రూపకల్పనకు ఎఐఎఫ్ఎఫ్ చేసిన కృషిని ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. తమకు ఉన్న అత్యున్నత ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎఐఎఫ్ఎఫ్ చేపట్టిన ఈ థీమ్.. ఆచరణీయమేనన్నారు.
భారతీయుల్లో ఎంతో ఆసక్తి ఉన్నదని, వారంతా పూర్తిగా కార్యరంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గత సీజన్లో భారతీయుల ఆటతీరుఉ గమనించానని వారిలో తెలుసుకోవాలని అభిరుచి ఎక్కువగా ఉన్నదని, దీంతో భారతీయ ఫుట్బాల్ క్రీడకు ఉజ్వల భవిష్యత్ ఉందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరిగే అండర్ - 27 వరల్డ్ ఫుట్బాల్ కప్ టోర్నీ నిర్వహణకు అద్భుతమైన ఏర్పాట్లు చేసినందుకు ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ను అభినందిస్తున్నట్లు తెలిపారు.