క్రికెట్ మాజీ లెజెండ్, ఇంగ్లండ్ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్కు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బీబీసీకి చెందిన ఒక డ్రాగ్ రేస్ కార్యక్రమంలో కో-హోస్ట్గా ఫ్లింటాఫ్ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆ రేస్ ప్రచారంలో భాగంగా తను కూడా రేస్లో పాల్గొన్నాడు. ఈ సమయంలోనే అతను నడుపుతున్న వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సర్రేలో ఈ ప్రమాదం జరిగింది. ఈ 45 ఏళ్ల మాజీ క్రికెటర్కు తగిలిన దెబ్బలు ప్రాణాంతకం కాదని సమాచారం. 'టాప్ గేర్ టెస్ట్ ట్రాక్లో వెళ్తుండగా ఫ్రెడ్డీకి ప్రమాదం జరిగి గాయపడ్డాడు. అయితే క్రూ మెడిక్స్ వెంటనే రంగంలోకి దిగి అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. తదుపరి చికిత్స కోసం అతన్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని త్వరలోనే అందిస్తాం' అని బీబీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ రేసింగ్ రంగంలో అడుగు పెట్టిన తర్వాత పలుమార్లు ఫ్లింటాఫ్కు ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. గతంలో తనతోపాటు రేస్ను హోస్ట్ చేస్తున్న వారితో కలిసి రేస్లో పాల్గొన్నాడు ఫ్లింటాఫ్. ఈ సమయంలో గంటకు 125 మైళ్ల వేగంతో వాహనాన్ని నడుపుతుండగా అది అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో కూడా అతను తీవ్రంగా గాయపడ్డాడు.
ఆ ప్రమాదం అనంతరం మాట్లాడిన ఫ్లింటాఫ్.. 'ఈ టాప్ గేర్ డ్రాగ్ రేసుల్లో నా పాత్ర చక్కగా పోషించేందుకు నేను చాలా దూరం వెళ్తా. కానీ ఈసారి మరీ ఎక్కువ దూరం వెళ్లిపోయిట్లున్నా. మీరు టీవీలో ఈ ఘటన చూస్తే ఇది ప్రమాదకరం అనే కన్నా.. పిచ్చితనం అనిపిస్తుంది' అని చెప్పాడు. ఆ ఘటన 2019లో జరగ్గా.. మళ్లీ ఇప్పుడు కూడా ఇలాంటి రేసింగ్ ప్రమాదంలోనే ఫ్లింటాఫ్ గాయపడ్డాడు.
2009లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఫ్లింటాఫ్.. ఇంగ్లండ్ తరఫున 79 టెస్టులు, 141 పరిమిత ఓవర్ల మ్యాచులు ఆడాడు. 2005లో జరిగిన యాషెస్ సిరీస్లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం బాక్సింగ్ను తన కెరీర్గా ఎంచుకోవాలని అనుకున్నాడు. ప్రస్తుతం డ్రాగ్ రేస్లో హోస్ట్గా చేస్తున్నాడు.