
హైదరాబాద్: 'దీప టోర్నమెంట్కు సిద్ధంగా లేదు' అని భారత జిమ్నాస్ట్ కోచ్ విశ్వేశ్వర్ నంది వెల్లడించాడు. ఈ ఏడాది ఆగష్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు జరగనున్న ఆసియన్ గేమ్స్ను టార్గెట్గా చేసుకుని ప్రయత్నిస్తున్నారట.
దీంతో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కామన్వెల్త్ క్రీడలకు దూరం కానుంది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఆమె గత కొంతకాలంగా పోటీలకు దూరంగా ఉంది. ఈ గాయం ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేకపోవడంతో ఈ ఏప్రిల్ 4 నుంచి 15 వరకు ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు దీప దూరం అవుతున్నట్లు ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపాడు.
''కామన్వెల్త్ క్రీడల్లాంటి మెగా ఈవెంట్లో పోటీపడటానికి దీప ప్రస్తుతం సిద్ధంగా లేదు. ప్రస్తుతానికి ఆమె ఫిట్గానే ఉంది. కానీ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా లేదు. ఆమె కెరీర్కు ఇదేమీ అడ్డంకి కాదు. త్వరలోనే కోలుకుని బరిలో దిగుతుంది'' అని దీప కోచ్ తెలిపారు.
రియో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శన చేసి దీప నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. 2014 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.