
హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్లో భారత బ్యాక్సింగ్ క్రీడాకారిణి, రాజ్యసభ ఎంపీ మేరీకోమ్ ఫైనల్ చేరుకున్నారు. దీంతో భారత్ ఖాతాలోకి మరో పతకం ఖాయమైంది. మహిళల 48 కేజీల విభాగంలో పోటీ పడుతోన్న మేరీకోమ్ సెమీస్లో జరిగిన పోరులో శ్రీలంక క్రీడాకారిణి అనుష దిల్రుక్షిని 5-0తో ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
దీంతో మేరీ కోమ్ తన ఖాతాలో స్వర్ణం లేదా రజతాన్ని దక్కించుకోవడం ఖాయం. గతంలో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన మేరీ కోమ్, కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మరోవైపు 60 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్కు చెందిన మరో బాక్సర్ సరితా దేవి ఆస్ట్రేలియా క్రీడాకారిణి అంజా చేతిలో ఓటమిపాలైంది.
బుధవారం పోటీల్లో భాగంగా భారత్ ఖాతాలో మూడు పతకాలా చేరాయి. 50 మీటర్ల పిస్టల్ షూటింగ్లో భారత్కు చెందిన ఓం ప్రకాష్ మితర్వాల్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ పోటీల్లో మితర్వాల్కు ఇది రెండో పతకం కావడం గమనార్హం. ఇదే పోటీలో జీతూ రాయ్ నిరాశ పరిచాడు.
అతను కేవలం 8వ స్థానానికి మాత్రమే పరిమితం అయ్యాడు. అంతకముందు మహిళల షూటింగ్ డబుల్ ట్రాప్లో శ్రేయాసి సింగ్ ఈ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్లో లోకల్ ఫేవరెట్ ఎమ్మా కాక్స్పై గెలిచి ఇండియాకు 12వ గోల్డ్ మెడల్ సాధించి పెట్టింది. మరో భారత క్రీడాకారిణి వర్ష వర్మన్ ఒక్క పాయింట్ తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది.
2014లో గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ గెలిచిన శ్రేయాసి సింగ్.. ఈసారి ఫైనల్లో 96+2 స్కోరుతో స్వర్ణాన్ని దక్కించుకుంది. మూడు రౌండ్ల తర్వాత శ్రేయాసి రెండోస్థానంలో, మరో ఇండియన్ షూటర్ వర్ష మూడోస్థానంలో ఉన్నారు. చివరికి శ్రేయ టాప్ ప్లేస్కు దూసుకెళ్లగా.. వర్ష మాత్రం నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది.
దీంతో రజతం గెలుచుకునే అవకాశాన్ని వర్ష వర్మన్ తృటిలో చేజార్చుకుంది. పురుషుల డబుల్ ట్రాప్లో భారత్కు చెందిన అంకుర్ మిట్టల్కు కాంస్యం అందించాడు. బుధవారం ఇప్పటి వరకు భారత్ సాధించిన మూడు పతకాలు షూటర్లు సాధించినవే కావడం విశేషం. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 24 పతకాలతో మూడోస్థానంలో కొనసాగుతోంది.