హైదరాబాద్: ద్రోణాచార్య పురస్కార జాబితా నుంచి తనను తొలగించినందుకు నిరసనగా జాతీయ కాంపౌండ్ ఆర్చరీ కోచ్ జీవన్జోత్ సింగ్ తేజ తన పదవికి రాజీనామా చేశాడు. అవార్డుల సెలెక్షన్ కమిటీ తొలుత జీవన్జ్యోత్ పేరును నామినీల జాబితాలో చేర్చినా, 2015లో ప్రపంచ యూనివర్సిటీ క్రీడల సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన ఘటనను దృష్టిలో పెట్టుకొని కేంద్ర క్రీడా శాఖ అతని పేరును తొలగించింది.
దీంతో కేంద్ర ప్రభుత్వంపై కినుక వహించిన అతడు తన పదవికి రాజీనామ చేశాడు. అయితే, తాను తప్పు చేయనప్పటికీ అప్పుడు క్రమశిక్షణ చర్యలు చేపట్టారని.. ఈ విషయం క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్కు కూడా తెలుసని అతనన్నాడు. తనకు ద్రోణాచార్య అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేయడం లేదని, ఎంపికలో పారదర్శకత ఉండాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తేజ తెలిపాడు.
"భారత ఆర్చరీ జట్టు కోచ్ పదవికి నేను రాజీనామా చేశాను. 2015లో నాపై భారత ఆర్చరీ సంఘం విధించిన ఏడాది కాలం నిషేధాన్ని పూర్తి చేసుకున్నాను. నాటి ఉదంతంలో నా పాత్ర లేదని విచారణలోనూ తేలింది" అని జీవన్ జ్యోత్ తెలిపాడు. 2015లో ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలకు వెళ్లినపుడు భారత జట్టు పోటీకి ఆలస్యంగా వెళ్లడంతో పతకం కోల్పోయింది.
అప్పటి జట్టుకు కోచ్గా తేజానే ఉన్నారు. అప్పుడు పోటీల సమయం గురించి తమకు సరైన సమాచారం ఇవ్వని చెఫ్ డి మిషన్దే తప్పు అని, కానీ తనపై నిషేధం పడిందని.. చేయని తప్పునకు పడ్డ నిషేధాన్ని కారణంగా చూపించి తనకు ద్రోణాచార్య నిరాకరించడం అన్యాయమని తేజ ఆవేదన చెందాడు.
ఇదిలా ఉంటే, ఇటీవల ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో కాంపౌండ్ టీమ్ విభాగంలో రజత పతకాలు గెలిచిన భారత పురుషుల, మహిళల జట్లకు జీవన్జ్యోత్ కోచ్గా ఉన్నారు.