హైదరాబాద్: ఆసియా గేమ్స్లో ఫైనల్ చేరడమే జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ మొట్టమొదటి లక్ష్యమని ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది పేర్కొన్నాడు. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరగనున్న పోటీలకు ఇండోనేసియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇలా రెండు నగరాలు వేదికగా నిలవడం ఆసియా గేమ్స్ చరిత్రలో ఇదే తొలిసారి.
ఇందుకోసం ఇప్పటికే సర్వం సిద్ధమైంది. కాగా, 2016 రియో ఒలింపిక్స్లో స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చిన దీపా కర్మార్కర్ తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. అయితే, ఒలింపిక్స్లో ప్రమాదకరమైన వాల్ట్ ఈవెంట్లో దీపా ప్రదర్శనను చూసిన ప్రతి ఒక్కరూ ముగ్దులయ్యారు.
పతకాలు గెలిచిన అథ్లెట్స్తో పాటు ఆమెకీ నజరానా ప్రకటించడంతో పాటు సన్మానాలు కూడా చేశారు. ఆ తర్వాత రెండేళ్లపాటు గాయం కారణంగా జిమ్నాస్టిక్స్కి దూరమైంది. ఇటీవలే జరిగిన జిమ్నాస్టిక్స్ వరల్డ్ ఛాలెంజ్ కప్లో స్వర్ణ పతకంతో దీపా మెరిసిన సంగతి తెలిసిందే.
దీంతో, ఆసియా గేమ్స్లోనూ ఆమె జోరు కొనసాగిస్తుందని కోచ్ బిశ్వేశ్వర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా దీపా కోచ్ నంది మాట్లాడుతూ "ఆసియా గేమ్స్లో పతకం గురించి ఆమె ఏం ఆలోచిస్తోందో? నాకు తెలీదు. కానీ.. రెండేళ్ల తర్వాత గాయం నుంచి కోలుకుని మళ్లీ జిమ్నాస్టిక్స్లో అదీ వాల్ట్లో పోటీపడటం అంత సులువు కాదు" అని అన్నాడు.
"ఆసియా గేమ్స్లో ఆమె ఫైనల్కి చేరాలని నేను ఆశిస్తున్నా. అది మా మొదటి లక్ష్యం. ఇటీవల ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్లో బంగారు పతకం గెలిచిన తర్వాత ఆమెపై అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ఆమెపై ఇప్పుడు ఒత్తిడి పెరిగింది. పోటీలో ఉన్నప్పుడు దీపా పతకం గెలవాలని అందరూ ఆశిస్తారు" అని నంది పేర్కొన్నాడు.