
జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా 18వ ఆసియా గేమ్స్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. పతకాల కోసం అన్ని దేశాలకు చెందిన ఆటగాళ్లు హోరాహోరీగా తలపడుతున్నారు. సోమవారం నాటికి పతకాల పట్టికలో చైనా 19 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా, 15 పతకాలతో జపాన్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
పోటీల్లో భాగంగా ఆదివారం టోర్నీలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. చైనా, జపాన్ దేశాలకు చెందిన జెండాలు కింద పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాటిని చేత్తో పట్టుకుని నిల్చున్నారు. వివరాల్లోకి వెళితే పోటీల్లో భాగంగా ఆదివారం పురుషుల 200మీటర్ల స్విమ్మంగ్ ఫైనల్ పోటీలు జరిగాయి.

చైనా, జపాన్ క్రీడాకారులు పతకాలను సొంతం చేసుకున్నారు. చైనాకు చెందిన సున్ యాంగ్ స్వర్ణం గెలుచుకోగా, జపాన్కు చెందిన మత్సుమోటో, ఇంజి జీ (జపాన్) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పోటీలు ముగిసిన అనంతరం యథావిధిగా నిర్వాహకులు ఆటగాళ్లకు మెడల్స్ ప్రజెంటేషన్ను నిర్వహించారు.
ఇందులో భాగంగానే ఆటగాళ్ల దేశాలకు సంబంధించిన జెండాలను సమీపంలో ఎగురవేసి స్వర్ణ నెగ్గిన క్రీడాకారుడి దేశానికి చెందిన జాతీయ గీతం ఆలపిస్తారు. ఈ సమయంలోనే అక్కడ ఓ పొరబాటు దొర్లింది. చైనా జాతీయ గీతం ప్రారంభంకాగానే ప్రమాదవశాత్తూ ఆ మూడు జెండాలు కింద పడిపోయాయి.