హైదరాబాద్: న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ నీకా కామన్వెల్త్ గేమ్స్లో సాధించిన స్వర్ణ పతకాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. న్యూజిలాండ్లోకి ఆక్లాండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత నెల గోల్డ్కోస్ట్లో జరిగిన ఈ క్రీడల్లో హెవీవెయిట్ కేటగిరీలో అతను విజేతగా నిలిచాడు.
న్యూజిలాండ్కు చెందిన బాక్సర్ డేవిడ్ నీకా ఈ ఏడాది ఏప్రిల్లో ఆస్ట్రేలియాలో నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం దక్కించుకున్నాడు. తాజాగా అతడు ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ తన పతకాన్ని విద్యార్థులకు చూపించిన అనంతరం తన కారులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత చూస్తే కారులో పతకం లేదు. వెంటనే అప్రమత్తమైన డేవిడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
'పతకం చోరీకి గురైందని తెలుసుకున్న అనంతరం అసహనానికి గురయ్యాను. ఇప్పుడు చాలా కోపంగా ఉంది. నా పతకం తిరిగి నా వద్దకు చేరుకుంటుందని ఆశిస్తున్నాను. దాని విలువ నాకు మాత్రమే తెలుసు. అది లేకపోతే నా కెరీర్కే విలువుండదు. దయచేసి నా పతకం నాకు ఇచ్చేయండి. నేను చెమటోడ్చి సాధించిన స్వర్ణం తిరిగి నా చేతికందుతుందన్న నమ్మకం నాకుంది' అని అన్నాడు డేవిడ్.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పతకంతో పాటుగా తదితర వస్తువులు చోరీకి గురైనట్లు వీడియో ఫుటేజీ దృశ్యాల్లో గమనించారు. 'దేశానికి ప్రాతినిథ్యం వహించి కామన్వెల్త్ గేమ్స్లో సాధించిన పతకం అంటే ఆటగాళ్లకు ఎంతో ప్రత్యేకం. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటాం' అని ఓ అధికారి తెలిపాడు.