ఐదుగురి వివరాలు తెలియకపోవడంతో:
పురుషుల 200మీటర్ల బటర్ ఫ్లై స్విమ్మింగ్ ఈవెంట్లో పాల్గొన్న ప్రకాశ్ అర్హత రౌండ్లల్లో మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్కు అర్హత సాధించాడు. కానీ, ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రకాశ్ తనదైన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో 5వ స్థానంలో నిలిచాడు. ఫైనల్లో ప్రకాశ్ మెరుగైన ప్రదర్శన చేయకపోవడానికి కారణం అతని ఆలోచనలన్ని కేరళలోని తన కుటుంబసభ్యుల చుట్టూ తిరగడం. భారీ వర్షాల కారణంగా కేరళ అతలాకుతలమయింది. బంధువులు, ఆప్తులు చాలా మంది వరకూ దూరమైయ్యారు. ఇడుక్కిలోని ప్రకాశ్ కుటుంబసభ్యులు ఐదుగురి వివరాలు మూడు రోజుల నుంచి తెలియరాలేదట.
ఆ కారణంతోనే ఫైనల్లో రాణించలేకపోయాడని:
జకార్తాలో ఉన్న ప్రకాశ్ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ఈ కారణంగానే అతడు ఫైనల్లో మంచి ప్రదర్శన చేయలేకపోయాడని అతడి తల్లి శాంతిమోల్ చెప్పారు. ‘ప్రకాశ్ ప్రతి రోజూ నాతో మాట్లాడుతున్నాడు. చాలా బాధపడుతున్నాడు. రేస్పై దృష్టి పెట్టలేకపోతున్నానని చెప్పాడు. ఒక వేళ కేరళలో పరిస్థితి ఇలా ఉండకపోతే ప్రకాశ్ తప్పక పతకం గెలిచేవాడు' అని ఆమె అన్నారు. ఇడుక్కిలోని చెరుత్తోని డ్యాం సమీపంలో ప్రకాశ్ కుటుంబభ్యులు నివాసముంటున్నారు. వర్షాల కారణంగా డ్యామ్ పొంగి పొర్లడంతో వారి ఇల్లు నీటమునిగింది. గత గురువారం నుంచి వారి కుటుంబసభ్యుల వివరాలు తెలియరాలేదు.
చెప్పమని బలవంత పెట్టడంతోనే
‘దేశం తరఫున బరిలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఈ విషయం చెబితే ప్రకాశ్ ఆందోళన చెందుతాడని నేను స్వయంగా చెప్పలేదు. క్రీడా గ్రామంలో ఎవరి నుంచో ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ తర్వాత శనివారం నాకు ఫోన్ చేసి ఏం జరిగింది.. చెప్తావా లేదా అని పట్టుబట్టాడు. దీంతో నేను అసలు విషయం చెప్పాల్సి వచ్చింది. ఇల్లు, భూమి అంతా కోల్పోయాం. ఇప్పటి వరకు మన అంకుల్ వాళ్లు ఎక్కడ ఉన్నది గుర్తించలేకపోయాం' అని ప్రకాశ్కు చెప్పినట్లు శాంతి తెలిపారు.
1986 తర్వాత ఇప్పటి వరకు భారత్ తరఫున:
1986లో జరిగిన ఆసియా క్రీడల తర్వాత ఇప్పటి వరకు భారత్ తరఫున ఏ స్విమ్మర్ పురుషుల 200మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్లో ఫైనల్కు చేరలేదు. తాజా ఆసియా క్రీడల్లో ఫైనల్ చేరిన ప్రకాశ్ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ 5వ స్థానంలో నిలిచి పతకాన్ని చేజార్చుకున్నాడు. 1986లో ఫైనల్ చేరిన కజన్ సింగ్ రజత పతకాన్ని అందుకున్నాడు.