హైదరాబాద్: ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ గాయపడింది. దీంతో ఆమె బుధవారం జరగనున్న మహిళల టీమ్ ఫైనల్స్ నుంచి తప్పుకుంది. దీపా కర్మాకర్కు అయిన గాయంపై ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది మాట్లాడారు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
"ప్రాక్టీస్ చేసే సమయంలో దీప కుడి కాలికి గాయమైంది. దీంతో ఆమె సరిగా పరిగెత్తలేకపోతోంది. ఈ కారణంగానే ఆమె టీమ్ ఈవెంట్ ఫైనల్స్ నుంచి తప్పుకుంది. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే ఆమె కోలుకుంటుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటోంది" అని అన్నారు.
"తనకెంతో ఇష్టమైన వాల్ట్ ఫైనల్కు అర్హత సాధించకపోవడంతో దీప ఎంతో బాధపడుతోంది. తనకెంతో గుర్తింపు తెచ్చిపెట్టిన వాల్ట్ విభాగంలోనే ఫైనల్ చేరలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇది నీ తప్పు కాదు అని ఎంత చెప్పినా ఆమె తీవ్ర అసంతృప్తితోనే ఉంది" అని తెలిపారు.
"దీని గురించి ఆలోచిస్తూ మంగళవారం రాత్రి భోజనం కూడా చేయలేదు. బుధవారం ఉదయం టిఫిన్ చేసేందుకు కూడా ఆమె నిరాకరించింది" అని బిశ్వేశ్వర్ తెలిపారు. ఆసియా గేమ్స్ పోటీల్లో భాగంగా మంగళవారం వాల్ట్ ఫైనల్ కోసం అర్హత పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో దీపా 8వ స్థానంలో నిలిచింది.
టాప్-8లో నిలిచిన వాళ్లు ఫైనల్కు అర్హులు. కానీ, దీపా కర్మార్కర్ కన్నా మరో ఇద్దరు భారత క్రీడాకారిణులు అరుణ, ప్రణతి మెరుగైన స్థానాల్లో నిలిచారు. ఆసియా గేమ్స్ నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి ఇద్దరికి మాత్రమే ఫైనల్కు అవకాశం లభిస్తుంది.
దీంతో దీప ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. బ్యాలెన్స్ బీమ్లో టైటిల్ రౌండ్లో చోటు సంపాదించిన దీపా ఇందులో పాల్గొనడం ఇప్పుడు అనుమానంగానే మారింది. రియో ఒలింపిక్స్ తర్వాత గాయపడంతో దీపా కర్మార్కర్ కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
ఈ శస్త్రచికిత్స తర్వాత కొన్నాళ్లు పోటీలకు కూడా దూరమైంది. ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్లో పాల్గొన్న దీపా కర్మార్కర్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. దీపా శస్త్రచికిత్స చేయించుకున్న కాలికే ఇప్పుడు గాయమైంది. దీంతో ఆమె కోచ్ బిశ్వేస్వర్ నంది ఆందోళన చెందుతున్నారు.
ఇండోనేషియా నుంచి భారత్ రాగానే దీపాకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ అనంత్ జోషిని కలవనున్నట్లు బిశ్వేశ్వర్ చెప్పారు. ఇదిలా ఉంటే ఆసియా గేమ్స్లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు భారత్ మొత్తం 11 పతకాలు సాధించింది. ఇందులో 4 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.