
హైదరాబాద్: చెక్ రిపబ్లిక్లోని ఒస్ట్రావా వేదికగా జరుగుతున్న ఐఏఏఎఫ్ కాంటినెంటల్ కప్లో భారత ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అర్పిందర్ ట్రిపుల్ జంప్లో 16.59 మీటర్ల దూరం లంఘించి కాంస్య పతకం సాధించాడు.
తద్వారా ఈ కాంటినెంటల్ కప్లో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్గా రికార్డు నమోదు చేశాడు. ఇటీవలే ఇండోనేషియా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో అర్పిందర్ స్వర్ణం సాధించాడు. తాజాగా ఆదివారం జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో 16.59మీ. దూకి మూడో స్థానంలో నిలిచాడు.
అయితే తర్వాత ప్రయత్నంలో 16.33 మీటర్లతో ఫైనల్కు అర్హత సాధించలేకపోయాడు. ఆసియా పసిఫిక్ జట్టు తరఫున బరిలోకి దిగిన అర్పిందర్ అంచనాలకు అనుగుణంగా రాణించి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగంలో ఒలింపిక్ చాంపియన్ క్రిస్టియన్ టేలర్(అమెరికా, 17.59మీ), హ్యుగస్ ఫ్యాబ్రైస్(బుర్కినా ఫాసో, 17.02మీ) వరుసగా స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు.
మరోవైపు పురుషుల జావెలిన్త్రోలో యువ ఆటగాడు నీరజ్ చోప్రా నిరాశపరిచాడు. ఎనిమిది మంది సభ్యుల పోటీలో అతడు ఆరో స్థానంలో నిలిచాడు. జావెలిన్ను 80.24 మీటర్ల దూరమే విసిరాడు. ఈ సీజన్లో ఇది అతడి చెత్త ప్రదర్శన కావడం గమనార్హం.
ఇక, పురుషుల 1500మీటర్ల రేసులో భారత స్ప్రింటర్ జిన్సన్ జాన్సన్ 3.41.72సెకన్ల టైమింగ్తో ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల 3000మీటర్ల స్టిపుల్చేజ్లో సుధాసింగ్ తన రేసును ముగించలేకపోయింది.