
హైదరాబాద్: ట్రెండ్కు తగ్గట్లు సినిమాలు వస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా.. ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ నేతలు, సినిమా స్టార్లు, క్రీడా ప్రముఖుల జీవితాలపై సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు అమితాసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనూ తాజాగా మరో స్పోర్ట్స్ స్టార్ జీవిత గాథను తెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల అక్షయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా ప్రస్తావించాడు.
పరుగుల సంచలనం హిమదాస్ బయోపిక్ నిర్మించేందుకు బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ ఆసక్తి చూపుతున్నారు. 2018 ఆసియా గేమ్స్కు సన్నద్ధమవుతున్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈడెల్ వీస్ గ్రూప్ శనివారం ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన గోల్డ్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆ ఈవెంట్కు హాజరయ్యారు.
నిర్మాతగా ఏ భారతీయ క్రీడాకారుడి సినిమాను తీసేందుకు ఇష్టపడతారని నిర్వాహకులు అడిగారు. హిమదాస్పై బయోపిక్ తీసేందుకు ఇష్టపడతాని అక్షయ్ చెప్పారు. 'పరుగుల పోటీల్లో గోల్డ్ మెడల్ సాధిండచమనేది చాలా అరుదైన ఘనత అని అన్నారు. ప్రస్తుతం రన్నింగ్ విభాగంలో భారత క్రీడారంగం వీక్గా ఉంది. ఆ క్రీడను ప్రోత్సహించాల్సిన అవసరముంది. భారత్లోనూ గొప్ప ప్రతిభావంతులు ఉన్నారని ప్రపంచానికి చాటిచెప్పాలి. అందుకే హిమదాస్పై బయోపిక్ తీయడానికి ఇష్టపడతాను' అని అక్షయ్ కుమార్ తెలిపారు.
18 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ అథ్లెటిక్ ఈవెంట్లో హిమా దాస్ సత్తా చాటారు. భారత్ తరఫున తొలి గోల్డ్ మెడల్ సాధించిన స్ప్రింటర్గా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆమెపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. పేద స్థాయి నుంచి వచ్చిన ఆమె దేశం గర్వించే స్థాయికి ఎదిగిన తీరు.. యువతకు స్ఫూర్తిగా నిలుస్తుండటంతో ఆమె గురించి తెలుసుకునేందుకు ఎక్కువ సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు.