
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో పట్నా పైరేట్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. పట్నా స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ (14) సూపర్-10తో మెరిసినా కూడా ఆ జట్టు మరో ఓటమి నుండి తప్పించుకోలేకపోయింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 35-26 స్కోరుతో పట్నాపై నెగ్గింది. దీంతో ఈ సీజన్లో హరియాణా రెండో విజయాన్ని నమోదు చేసింది.
మ్యాచ్ ఆరంభం నుంచి హరియాణాదే ఆధిపత్యం కొనసాగింది. తొలి రైడ్ నుంచే దూకుడుగా ఆడిన హరియాణా ఎనిమిదో నిమిషంలోనే పట్నాను ఆలౌట్ చేసి 10-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రైడర్ వికాస్ (10), వినయ్ (6) లు వరుసగా పాయింట్లు తేవడంతో తొలి అర్ధభాగాన్ని 17-9తో ముగించింది. విరామం తర్వాత హరియాణాకు ఎదురులేకుండా పోయింది. మరోవైపు ట్యాక్లింగ్లో రవి కుమార్ (4), సునీల్ (4) సత్తాచాడంతో మరోసారి పట్నా ఆలౌట్ అయింది. డిఫెండర్లు, రైడర్లు సమష్టిగా రాణించడంతో చివరి వరకు ఆధిక్యాన్ని కొనసాగించి హరియాణా మ్యాచ్ను కైవసం చేసుకుంది.
అంతకుముందు యూపీ యోధ, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య త్రీవ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ చివరకు 28-28తో టై అయింది. చివరి రెండు నిమిషాల ఆట ఉందనగా ఇరు జట్ల స్కోరు 27-27తో సమమైంది. ఈ సమయంలో రిషాంక్ దేవడిగ పాయింట్ తెచ్చి యూపీని ఆధిక్యంలో నిలిపాడు.అయితే చివరి రైడ్లో అజయ్ ఠాకూర్ పాయింట్తో మ్యాచ్ టైగా ముగిసింది. తలైవాస్ స్టార్ రాహుల్ చౌదరి (5) ఆకట్టుకోలేకపోయాడు. షబీర్ బాపు (5), మంజీత్ చిల్లర్ (4) రాణించారు. యూపీ తరపున రిషాంక్ (5) రైడింగ్లో, సుమిత్ (4) ట్యాక్లింగ్లో మెరిశారు. గురువారం జరిగే మ్యాచ్లో బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది.